tharoor: పాకిస్తానీ మహిళతో శశిథరూర్ మూడో పెళ్లి.. నకిలీ వార్తపై సరదాగా స్పందించిన మహిళ!

  • పేరడీ ట్విట్టర్ ఖాతాలో థరూర్ పెళ్లి వార్త
  • వాస్తవాలు చెక్ చేయకపోవడంపై తరార్ ఆశ్చర్యం
  • వివరణ ఇచ్చిన ట్విట్టర్ అకౌంట్ ఓనర్

నకిలీ వార్తలు, వదంతులు ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. కొందరేమో వీటిని సరదాగా చేస్తే.. మరికొందరేమో ఫలానా వారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేస్తుంటారు. ఏదేమైనా కొన్నిసార్లు వీటి కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ పాకిస్తానీ జర్నలిస్ట్ మెహ్ర్ తరార్ ను త్వరలోనే పెళ్లాడబోతున్నారని సీఎన్ఎన్ న్యూస్ 18 పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఇది సదరు టీవీ చానెల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కాదు. కేవలం శశిథరూర్, తరార్ ల వివాహంపై వార్త రాగానే ముందువెనుక చూసుకోకుండా 66 మంది ఫాలోకావడం మొదలుపెట్టారు. ఈ ట్వీట్ ఇంటర్నెట్ లోనూ వైరల్ గా మారింది.

ఇది చివరికి తరార్ దృష్టికి రావడంతో ఆమె సరదాగా స్పందించారు. ‘ఈ మొత్తం వ్యవహారంలో తమాషా ఏంటంటే, ఓ పేరడీ అకౌంట్ లో వచ్చిన తప్పుడు కథనానికి చాలామంది స్పందించారు. కొన్ని రోజుల క్రితమే ప్రారంభించిన ఈ అకౌంట్ కు కేవలం 66 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. కనీసం దీని గురించి పట్టించుకోకుండా ప్రజలు నకిలీ వార్తలను నమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది’ అని ట్వీట్ చేశారు. దీంతో కేసులు పడొచ్చని భయపడ్డ సదరు ట్విట్టర్ అకౌంట్ యూజర్ తనది కేవలం పేరడీ ఛానల్ మాత్రమేనని స్పష్టం చేశాడు. శశిథరూర్ గతంలో తిలోత్తమ ముఖర్జీ, సునందా పుష్కర్ లను పెళ్లాడారు. సునంద అనుమానాస్పద మరణం కేసులో థరూర్ పేరును ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్ లో చేర్చారు.

More Telugu News