Hyderabad: 'ఐ లవ్ యూ... చంపొద్దు' అని మొత్తుకుంటున్నా వినని ప్రియుడు.. అనూష హత్య కేసు వివరాలు!

  • హైదరాబాద్ లో కలకలం రేపిన అనూష హత్య కేసు
  • రెండేళ్ల ప్రేమ అనంతరం వెంకట్ ను దూరం పెట్టిన అనూష
  • ప్రేమోన్మాదిగా మారి హత్య చేసిన వెంకట్

హైదరాబాద్ లో కలకలం రేపిన అనూష హత్య కేసును పోలీసులు ఛేదించారు. రెండు సంవత్సరాల పాటు ప్రేమించి, ఆపై దూరం పెట్టినందున ప్రేమోన్మాదిగా మారిన ఆరేపల్లి వెంకట్ అనే యువకుడు, ఆమె గొంతును బ్లేడుతో కోశాడని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను మీడియాకు వెల్లడించారు.

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి హరిప్రసాద్ కుమార్తె, నారాయణగూడలోని ఓ కాలేజీలో చదువుతున్న అనూషకు, హిమాయత్ నగర్ లో ఇంటర్ చదువుతున్న వెంకట్ కు పదవ తరగతి నుంచే పరిచయం ఉంది. వీరిద్దరి మధ్యా గొడవలు రాడవంతో గత నెల రోజులుగా అనూష అతన్ని దూరం పెట్టింది. ఆమెతో మాట్లాడాలని వెంకట్ ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఈ క్రమంలో అనూష, ఆమె ఫ్రెండ్ ద్విచక్ర వాహనంపై వెళుతుంటే చూసి, వారిని ఫాలో అయిన వెంకట్, అనూష ఇంట్లోకి వెళ్లగానే బైక్ కీస్ లాక్కున్నాడు. అనూషను జామై ఉస్మానియా ప్రాంతానికి తెస్తేనే బండి ఇస్తానని ఆమె ఫ్రెండ్ కి చెప్పి వెళ్లిపోయాడు.

దీంతో ఇదే విషయాన్ని అనూషకు చెప్పిన ఆమె, తనతో పాటు జామై ఉస్మానియా వద్దకు అనూషను వెంటబెట్టుకుని వచ్చింది. ఆపై బైక్ ను వెంకట్ ఇచ్చేశాడు. మాట్లాడాలని ఉందంటూ, అనూషను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కు సమీపంలోని పాడుబడిన పోలీసు క్వార్టర్స్ కు తీసుకెళ్లి వాదనకు దిగాడు. క్యారెక్టర్ నచ్చకనే నిన్ను దూరం పెట్టానని అనూష చెప్పడంతో, అప్పటికే జేబులో సిద్ధంగా ఉంచుకున్న బ్లేడుతో ఆమె గొంతుపై గాట్లు పెట్టాడు.

తన ప్రాణాలు తీస్తాడని భయపడిన ఆమె, "నిన్నే ప్రేమిస్తా, ఐ లవ్ యూ, నన్ను చంపొద్దు" అని వేడుకుంది. ఎవరైనా కాపాడాలని కేకలు పెట్టింది. ఆమె అరుపులను పట్టించుకోని వెంకట్, గొంతును మరింత లోతుకు కోసి హతమార్చాడు. మరో గదిలోకి తీసుకెళ్లి పడేసి పారిపోయేందుకు ప్రయత్నించగా, అనూష అరుపులను విన్న కొందరు యువకులు, అక్కడికి వచ్చి వెంకట్ ను బంధించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం అనూష మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని డీసీపీ రమేష్ వెల్లడించారు. 

More Telugu News