Angelina Jolie: రూ.61 కోట్లు ఇచ్చాను.. అయినా నా పేరు చెడగొడుతోంది!: ఏంజెలినా జోలీపై బ్రాడ్ పిట్ ఆగ్రహం

  • కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఆవేదన
  • పిల్లల కస్టడీ కోరుతూ మరో పిటిషన్
  • 2016లోనే విడిపోయిన హాలీవుడ్ జంట

బ్రాంజెలీనా.. హాలీవుడ్ సెలబ్రిటీ జంట ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ లకు అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరిది. 2016, సెప్టెంబర్ లో ఈ జంట విడిపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. తాగుడుకు బానిసైన పిట్.. పిల్లల్ని కొట్టడంతో ఏంజెలినా విడాకులు తీసుకుంది. ఈ సందర్భంగా కోర్టు ఆరుగురు పిల్లల సంరక్షణను ఏంజెలినాకే అప్పగించింది.
అయితే కుటుంబ పోషణ, పిల్లల సంరక్షణ కోసం బ్రాడ్ పిట్ తగినంత నగదు ఇవ్వలేదని ఏంజెలినా ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పిట్ స్పందిస్తూ.. విడాకుల సమయంలో జోలీకి రూ.61 కోట్లు(9 మిలియన్ డాలర్లు) ఇచ్చానని చెప్పాడు. తన పేరు చెడగొట్టేందుకే జోలీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, చిన్నారులను తనకూ జాయింట్ కస్టడీకి ఇవ్వాలని పిట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలుచేశాడు. దాదాపు 11 ఏళ్ల పాటు ఈ జంట సహజీవనం చేసింది.

హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ ను 2000లో పెళ్లి చేసుకున్న బ్రాడ్ పిట్.. 2005లో విడాకులు తీసుకున్నాడు. నటులు జోనాథన్ లీ మిల్లర్, బిల్లీ బాబ్ లను గతంలో పెళ్లాడిన ఏంజెలినా వారికి విడాకులిచ్చింది. ఏంజెలినా-బ్రాడ్ పిట్ జంటకు ఆరుగురు పిల్లలు కాగా, వీరిలో ఇద్దరు దత్తత పిల్లలు.  

More Telugu News