jenasena: ‘జనసేన’ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ కు తుది రూపు

  • పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చ
  • మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు, ప్రాధాన్యాలపై చర్చ
  • జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ వెల్లడి

జనసేన మేనిఫెస్టో పార్టీ సిద్ధాంతాలకు అద్దంపడుతూ... ప్రజా క్షేమం, అభివృద్ధి పరమావధిగా, మానవీయ కోణంతో ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన బృందంతో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (ప్యాక్) సోమ, మంగళవారాల్లో చర్చించింది. ఈ సమావేశాల్లో ప్యాక్ కన్వీనర్ మాదాసు గంగాధరం, ప్యాక్ సభ్యులు తోట చంద్రశేఖర్, మారిశెట్టి రాఘవయ్య, అర్హం యూసుఫ్, అశోక్ పాల్గొన్నారు.

పవన్ కల్యాణ్ చెప్పిన ఏడు సిద్ధాంతాల్లోని స్ఫూర్తి ప్రతి అంశంలోనూ ఉంటుందని, మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలు, ప్రాధాన్యాలపై చర్చించామని ప్యాక్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటికి చేపట్టాల్సిన పరిష్కారాలు, పథకాలు అమలులో లోపాలు, సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తీరుపై ఈ  సమావేశంలో ప్రస్తావించినట్టు చెప్పారు. విజన్ డాక్యుమెంట్ అనేది మేనిఫెస్టో రూపకల్పనకు ఒక దిక్సూచిగా ఉపయోగపడాలని ప్యాక్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పార్టీ వ్యవహారాల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేయాలని ప్యాక్ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ఆరు జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల పరిశీలన, సమీక్షలు చేసి ఆ కమిటీ ప్యాక్ కు నివేదిక ఇస్తుందని, రాష్ట్ర స్థాయి సమన్వయకర్తలు, జిల్లా కో ఆర్డినేటర్లు, జాయింట్ కో ఆర్డినేటర్లతో త్వరలోనే ఒక సమావేశాన్ని నిర్వహించాలని   నిర్ణయించామని, బూత్ స్థాయి వరకూ పార్టీ కార్యక్రమాలను నూతనోత్తేజంతో చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను తెలియజేసి అందుకు అనుగుణంగా దిశానిర్దేశం చేస్తారని ప్యాక్ సభ్యులు తెలిపారు.

More Telugu News