BJP: బీజేపీ నేతకు చేదు అనుభవం.. దుర్వాసన కొడుతున్న ఆహారాన్ని సరఫరా చేసిన రైల్వే కేటరింగ్ సిబ్బంది!

  • బీజేపీ దక్షిణ ముంబై  సోషల్ మీడియా చీఫ్ ఆగ్రహం
  • పురుగుల భోజనంపై రైల్వే మంత్రికి ఫిర్యాదు
  • విచారణకు ఆదేశించిన మంత్రి గోయల్

ఆయన సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన నేత. అయితేనేం రైల్వే క్యాటరింగ్ సిబ్బంది మాత్రం తమ స్టయిల్ లో పురుగులు పడి దుర్వాసన వస్తున్న ఆహారాన్ని ఆయనకు సరఫరా చేసి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన డైరెక్టుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు ఫిర్యాదు చేశారు.

బీజేపీ దక్షిణ ముంబై సోషల్ మీడియా చీఫ్ కరణ్ రాజ్ సింగ్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా కరణ్ తన అనుచరుడితో కలసి గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో స్వయంగా తెలుసుకోవడం కోసం ఆయన ఆహారం ఆర్డర్ చేశారు. అయితే రైలు క్యాటరింగ్ సిబ్బంది పురుగులతో దుర్వాసన వస్తున్న ఆహారాన్ని అందించడంపై కరణ్ తీవ్రంగా మండిపడ్డారు.

ఈ వ్యవహారంపై మరో 30 మంది ప్రయాణికులతో కలసి కరణ్ రైల్వే మంత్రి గోయల్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన గోయల్.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారుల్ని ఆదేశించారు.

More Telugu News