Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. భర్తను కారులో బంధించి భార్యపై సామూహిక అత్యాచారం!

  • పని మనుషుల్ని చూపిస్తామని మోసం
  • నగదు, బంగారం దోచుకుని పరార్
  • కేసు నమోదుచేసిన పోలీసులు

మనుషులు మానవత్వాన్ని మర్చిపోతున్నారు అనటానికి తాజా ఉదాహరణ ఇది. ఓ హోటల్ నడుపుతున్న జంటకు పని మనుషుల్ని చూపిస్తానని నమ్మబలికిన ఓ వ్యక్తి.. భర్తను గాయపర్చి అతని భార్య(20)పై మరో ఏడుగురితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు 8 నెలల గర్భిణి అయినప్పటికీ నిందితులు కరుణించలేదు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, సతారా జిల్లాలో ఈ జంట ఓ హోటల్ ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హోటల్ లో పనిచేసేందుకు ఇధ్దరు అవసరమయ్యారు. ఇంతలో ముకుంద్ మానే అనే నిందితుడు వీరిని సంప్రదించాడు. ఇక్కడి తుర్చిఫాటా ప్రాంతంలో ఓ జంట పనిచేసేందుకు సిద్ధంగా ఉందనీ, రూ.20 వేలు అడ్వాన్స్ తీసుకుని రావాలని చెప్పాడు.

దీంతో భార్యతో కలసి హోటల్ యజమాని తుర్చిఫాటాకు రాగా, అక్కడే మరో 8 మంది నిందితులతో కలసి ముకుంద్ అతనిపై కర్రలు, రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం అతడిని కారులో కట్టేసి.. బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వీరివద్ద ఉన్న నగదు, బంగారం దోచుకుని పరారయ్యారు. తమకు స్థానికంగా చాలా పలుకుబడి ఉందని, కాబట్టి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోవాలని హెచ్చరించారు. దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News