komatireddy: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కోమటిరెడ్డి

  • కవిత, టీఆర్ఎస్ ఎంపీలు కూడా హోదాకు మద్దతు తెలిపారు
  • తెలంగాణ వచ్చిన సంతోషం ఏ ఒక్కరిలో లేదు
  • కేసీఆర్ కుటుంబానికి తప్ప.. మంత్రులకు కూడా అధికారాలు లేవు

విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీకాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత సహా టీఆర్ఎస్ ఎంపీలు కూడా మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఈ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురిసి, ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు.

తెలంగాణ వచ్చిన సంతోషం ఏ ఒక్కరిలో లేదని... కేవలం పాలకులు మాత్రమే ఆనందంగా ఉన్నారని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులకు తప్ప ఇతర మంత్రులకు కూడా అధికారాలు లేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాగితాలపై తప్ప, వాస్తవంగా లేదని తెలిపారు. 

More Telugu News