Hyderabad: హైదరాబాద్ యువకులకు వాట్స్ యాప్ వగలాడి గాలం... ఫ్యామిలీస్ ఉండే ఇళ్లకు వెళ్లి మోసపోయిన 100 మంది!

  • ఆన్ లైన్ లో పరిచయం చేసుకునే అమ్మాయి
  • గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్ షేర్
  • అక్కడికి వెళ్లి మోసపోతున్న యువకులు
  • కేసు విచారణ తమ వల్ల కాదంటూ సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన బేగంపేట పోలీసులు

అమ్మాయిల ఫొటోలతో వెబ్‌ సైట్‌ ను ప్రారంభించిన ఓ వగలాడి, లైవ్‌ చాట్‌ లో యువకులకు ఎరవేస్తూ, ఆన్ లైన్ లో మాత్రమే డబ్బు చెల్లించాలని షరతు పెట్టి, ఆపై గూగుల్ మ్యాప్ ద్వారా ఫ్యామిలీస్ ఉండే లొకేషన్ ను చూపుతుండటంతో, ఆమె మాటలను నమ్మి అక్కడికి వెళ్లి, తాము మోసపోయామని తెలుసుకున్న పలువురు యువకులు పోలీసులను ఆశ్రయించారు.  తమ ముందుకు వచ్చిన ఈ కేసును ఛేదించే బాధ్యతను సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు బేగంపేట పోలీసులు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, "లడ్డూ కావాలా?" అంటూ స్మార్ట్‌ ఫోన్‌ కు ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని తెరవగానే, కవ్వించే అందమైన అమ్మాయి ఫొటో, వాట్స్ యాప్ నంబర్ కనిపిస్తాయి. దాన్ని చూసిన వారు ఆశపడి స్పందిస్తే, కాసేపటికే అయితే రూ. 3 వేలు, రాత్రికైతే రూ. 7 వేలు ఫలానా ఖాతాలో జమ చేయాలన్న సందేశం వస్తుంది.

ఇక ఎంజాయ్ చేద్దామని భావించి, ఆ డబ్బును జమ చేయగానే, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా బేగంపేటలోని ఓ లొకేషన్ షేర్ అవుతుంది. సదరు అపార్టుమెంట్ లోని ఫలానా ఫ్లోర్ కు వెళ్లాలని, ఏ తలుపు తీసుంటే దానిలోకి నిర్భయంగా రావాలని చెబుతుంది. ఇక అక్కడికి వెళ్లిన వారు, తాము ఫ్యామిలీస్ ఉంటున్న అపార్టుమెంట్ కు వచ్చామని, మోసపోయామని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు.

ఈ క్రమంలో వాగ్వాదాలు, ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. దాదాపు వంద మందిని ఈ మాయలేడి మోసం చేసింది. మోసపోయిన యువకుల బాధ ఒకలా ఉంటే, అపార్టుమెంట్ లో ఉంటున్న వారి బాధ మరొకటి. పగలు, రాత్రి లేకుండా గంటకొకరు వచ్చి తలుపు కొడుతుంటే, వారికి సమాధానం చెప్పలేకపోతున్న పరిస్థితి. ఇంట్లోని మగవారు ఆఫీసులకు పోలేక కాపలా కాయాల్సి వస్తోందని ఆ కుటుంబంలోని వారు వాపోతున్నారు.

అపార్టుమెంటు వాసుల ఫిర్యాదు మేరకు అక్కడో పెట్రోలింగ్ వాహనాన్ని పెట్టగా, నెల రోజుల వ్యవధిలో 100 మందికి పైగా యువకులు వచ్చారు. వారిని ఆరా తీసి, 20 మందిపై కేసులు పెట్టారు. ఇక సదరు వగలాడి నంబరును ట్రేస్ చేస్తుంటే ఒక రోజు చెన్నైలో, మరో రోజు నాగపూర్ లో, ఇంకో రోజు బెంగళూరులో ఉన్నట్టు చూపిస్తోంది. ఇక కేసును ఛేదించడం తమ వల్ల కాదని భావించిన బేగంపేట సీఐ అశోక్‌రెడ్డి, ఇటీవల సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించారు. యువతి తయారు చేసుకున్న వెబ్ సైట్ ను తొలగించగా, ఆమె మరో సైట్‌ సృష్టించుకుంది. అతి త్వరలోనే ఆమె ఆట కట్టిస్తామని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

More Telugu News