Chiranjeevi: చిరంజీవి షూటింగ్‌కు అధికారుల అడ్డు.. ‘సైరా..’ సెట్ ను కూల్చేసిన రెవెన్యూ అధికారులు!

  • ‘రంగస్థలం’ సెట్‌లో ‘సైరా’ షూటింగ్
  • అనుమతి లేదంటూ సెట్ కూల్చేసిన అధికారులు
  • ఆగిన షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తెరకెక్కుతున్న రెండో సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి హైదరాబాద్ రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. చిరంజీవి తనయుడు రాంచరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘రంగస్థలం’ చిత్రం కోసం వేసిన సెట్‌లోనే ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ జరుగుతోంది. అయితే, ఇది ప్రభుత్వ భూమి కావడం, అనుమతి లేకుండా సెట్ వేయడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని కథనాయకుడి కోసం వేసిన ఇంటి సెట్‌ను కూల్చేశారు.

భూకబ్జాకు ఇది ముందస్తు ప్లాన్ అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనుమతుల్లేకుండా సెట్ వేసి, ఆ తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలనేది చిత్ర యూనిట్ ప్రణాళికలో ఓ భాగమని అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకనే కూల్చేసినట్టు తెలిపారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు అందించినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే కూల్చివేయాల్సి వచ్చిందని తెలిపారు. అనుమతి తీసుకోకుండా సెట్ వేయడమే చిత్ర యూనిట్ చేసిన తప్పు అని, అనుమతులు కోరితే ఉచితంగానైనా పర్మిషన్ ఇచ్చి ఉండేవారమని అధికారులు పేర్కొన్నారు. సెట్ కూల్చివేతపై చిత్ర బృందం స్పందించలేదు. సెట్ కూల్చివేయడంతో ‘సైరా’ షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది.

More Telugu News