Love Marriage: కొన్నాళ్ల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం... ఇప్పుడు ఆ యువజంట ఆత్మహత్య!

  • ఐదు నెలల క్రితం వివాహం
  • శనివారం పొలానికి వెళ్లి ఆత్మహత్య
  • ఆర్థిక ఇబ్బందులే కారణమన్న తల్లి

ఏం కష్టం వచ్చిందో ఏమో... పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువజంట కలసి ఒకే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఒకే సామాజిక వర్గానికి చెందిన మల్లేశ్ అలియాస్ సద్గురు (19), జ్యోతి (18) ప్రేమించుకుని విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, ఐదు నెలల క్రితం వారికి వివాహం జరిగింది. పరిగిలో మల్లేశ్ పంక్చర్ షాపు నడుపుతూ ఉండగా, జ్యోతి అత్తమామలకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంటుంది. వీరు గ్రామంలోని అందరితో కలివిడిగా ఉండేవారు.

ఈ క్రమంలో శనివారం నాడు తన తల్లి మాణెమ్మ, భార్యతో కలసి పొలానికి వెళ్లిన మల్లేష్, పనులైన తరువాత, తాము బైక్ పై వస్తామని చెప్పి, తల్లిని ఇంటికి పంపించాడు. ఆపై ఎంతసేపటికీ కొడుకు, కోడలు రాకపోవడంతో, ఇంటి సభ్యులతో కలసి తల్లి పొలానికి వెళ్లి చూసి షాక్ కు గురైంది. ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. ఆర్థిక ఇబ్బందులతోనే వారు మరణించారని మాణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

More Telugu News