Haryana: పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని జంట ఆత్మహత్యాయత్నం.. కట్ చేస్తే ఆస్పత్రి లోనే వివాహం!

  • ఆత్మహత్యాయత్నం చేసిన హరియాణా జంట
  • దిగివచ్చిన ఇరువురి తల్లిదండ్రులు 
  • ఆస్పత్రిలోనే వివాహం జరిపించిన వైనం

తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించని కారణంగా ఇటీవలి కాలంలో చాలామంది యువతీ యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్లయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఏకంగా కన్నబిడ్డల్నే తల్లిదండ్రులు హతమారుస్తున్నారు. కానీ హరియాణాలోని హిస్సార్ జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. తొలుత పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు చివరికి పిల్లల సంతోషం కోసం దిగివచ్చి వివాహానికి అంగీకరించారు.

హిస్సార్ లో ఉంటున్న గుర్ముఖ్ సింగ్(23), పక్కనే విద్యుత్ నగర్ ఉండే కుసుమ్(22) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ తమ ఇళ్లలో చెప్పగా, ఇరు కుటుంబాలు వివాహానికి ససేమిరా అన్నాయి. దీంతో విడిపోయి బతకలేమని భావించిన ఈ జంట హిస్సార్ లోని ఓ ఇంటర్నెట్ షాప్ వద్ద పురుగుల మందు తాగింది. దీన్ని గమనించిన స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

వీరిద్దరినీ ఆస్పత్రిలో చూసిన కుటుంబ సభ్యులు భోరుమన్నారు. పెళ్లి చేయబోమంటే ప్రాణాలు తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మీ ఇధ్దరి సంతోషం కంటే మాకు ఏదీ ఎక్కువ కాదంటూ వివాహానికి అంగీకరించారు. అంతేకాకుండా సింగ్, కుసుమ్ ల వివాహాన్ని ఆస్పత్రిలోనే జరిపించారు. ఈ జంట ప్రాణాలకు తెగించి తమ ప్రేమను గెలిపించుకుందన్న మాట.

More Telugu News