Multiplex: హైదరాబాద్ మల్టీప్లెక్స్ లలో ఆగస్టు 1 నుంచి ఎమ్మార్పీకే అమ్మాలి!: అకున్ సబర్వాల్ ఆదేశాలు

  • వివిధ బ్రాండ్ల మంచినీళ్ల బాటిల్స్ ఉంచాలి 
  • ఎక్కువ రేటుకి అమ్మితే భారీ జరిమానా, జైలుశిక్ష
  • ప్రత్యేక రైడ్స్.. పర్యవేక్షణ ఉంటుంది   

హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లలో ఆగస్టు 1 నుంచి ఎంఆర్పీకి మాత్రమే అన్ని రకాల ప్రొడక్టులను విక్రయించాలని, ఈ విషయంలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ విభాగం కంట్రోలర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. ఎంఆర్పీపై అదనంగా వసూలు చేసినట్టు తెలిస్తే, భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని అన్నారు. నీళ్ల బాటిల్స్ అమ్మేవారు, వివిధ రకాల బ్రాండ్ లను తప్పనిసరిగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచి, వారికి నచ్చిన బాటిల్ కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్యాకేజ్డ్ ప్రొడక్టు ఏదైనా ఎంఆర్పీపై మాత్రమే అమ్మాలని తెలిపారు.

కాగా, ఇటీవలి కాలంలో సినిమా హాల్స్, మల్టీప్లెక్స్ లలో అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సమీక్ష జరిపిన ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక మల్టీప్లెక్స్ లలో అమ్మే ప్యాకింగ్ లేని ఫుడ్... అంటే పాప్ కార్న్, శీతల పానీయాలు తదితరాలను అందించే కంటెయినర్లపై ఎంత బరువు? ధర ఎంత? తదితర విషయాలు తప్పనిసరిగా ముద్రించాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు.

తమ అధికారులు ప్రత్యేక రైడ్ లు చేస్తూ, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. సింగిల్ రేట్ పాలసీని అమలు చేస్తామని, నిబంధనలు మీరిన తొలిసారి రూ. 25 వేలు, రెండో సారి రూ. 50 వేలు, మూడోసారి రూ. 1 లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

More Telugu News