Andhra Pradesh: ఏపీ బీజేపీ నేతల్లారా.. ముందీ విషయం తేల్చండి: టీడీపీ అధికార ప్రతినిధి రేణుక

  • రైల్వే జోన్ విషయంలో బీజేపీ నేతల విరుద్ధ ప్రకటనలు
  • ఏపీ బీజేపీ నేతలు ఆంధ్రాబిడ్డలో, బీజేపీ తొత్తులో తేల్చుకోవాలి
  • పవన్, జగన్ ఢిల్లీలో పోరాడాలి

ఏపీ బీజేపీ నేతలు తొలుత వారు ఆంధ్రా బిడ్డలో, బీజేపీ తొత్తులో తేల్చుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ మంత్రేమో విశాఖకు రైల్వే జోన్  ఇస్తామని అంటారని, మరో ఎంపీ కుదరదని చెబుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. జోన్ ఇస్తారో, ఇవ్వరో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.

రైల్వేజోన్ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒడిశా చెబుతున్నప్పటికీ బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న చంద్రబాబుపై బీజేపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును విమర్శిస్తున్న పవన్, జగన్‌లు ఢిల్లీలో పోరాటం చేయాలని రేణుక సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఏకపక్షంగా గెలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు.

More Telugu News