AIADMK: శశికళ మేనల్లుడు దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడికి యత్నం.. ముగ్గురికి గాయాలు!

  • పార్టీ నుంచి తొలగించడంతో కక్ష గట్టిన పరిమళం
  • కారులో పెట్రోల్ బాంబు ఉంచి దాడికి యత్నం
  • దినకరన్ ఇంటికి సమీపంలో కారులోనే పేలిన బాంబు

అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధినేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి యత్నం జరిగింది. చెన్నైలో ఆయన ఇంటిపై ఈ రోజు మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, ఓ కారు ధ్వంసమైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నుంచి బుల్లెట్ పరిమళం అనే వ్యక్తిని ఇటీవల తొలగించారు. ఈ నేపథ్యంలో దినకరన్ పై కక్ష పెంచుకున్న పరిమళం, ఆయన ఇంటిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.

పెట్రోల్ బాంబును తన కారులో తీసుకుని దినకరన్ ఇంటి సమీపంలో పార్క్ చేశాడు. ఆ సమయంలోనే పెట్రోల్ బాంబు పేలినట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో దినకరన్ కారు డ్రైవర్, వ్యక్తిగత ఫొటో గ్రాఫర్ డార్వన్, సమీపంలో ఉన్న ఓ ఆటో డ్రైవర్ గాయపడినట్టు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా, కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు నిందితుడు పరిమళం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా, గత ఏడాది తమిళనాడులోని అర్కే నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  

More Telugu News