jamuna: ఈమధ్య ఒక హీరో తన బూటుకాలు నాకు తగిలేలా కూర్చున్నాడు: జమున

  • ఎదిగిన కొద్దీ ఒదిగి వున్నాం 
  • సీనియర్స్ ను గౌరవించాం 
  • ఇప్పుడు ఆ పరిస్థితి లేదు

తెలుగు తెరపై అందాల కథానాయికగా ఒక వెలుగు వెలిగిన అలనాటి కథానాయిక జమున, సినిమాల పరంగా వస్తోన్న మార్పులను గమనిస్తూనే వస్తున్నారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో తన మనోభావాలను ఆవిష్కరించారు. "ఒకప్పటికీ .. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. నేను .. సావిత్రి .. భానుమతి .. ఇలా మా తరంలో అందరం ఎదుగుతున్న కొద్దీ ఒదుగుతూ వచ్చాం. అలా ఉండటం వల్లనే ఒక్కొక్కళ్లం పాతిక .. ముప్పై సంవత్సరాలు కథానాయికలుగా చలామణి అయ్యాం.

 పెద్దలను గౌరవించడం మా తరానికి బాగా తెలుసు. దర్శకుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడమే కాదు .. ఇలా చేస్తే ఎలా ఉంటుందండి? అని అడిగి, పెద్ద దర్శకులను ఒప్పించిన సందర్భాలు వున్నాయి. దర్శక నిర్మాతలు .. హీరో హీరోయిన్ల మధ్య ఒక చక్కటి వాతావరణం ఉండేది. ఇప్పుడు సీనియర్స్ ను గౌరవించే పరిస్థితులు లేవు.

ఈ మధ్య ఒక సినిమా ఫంక్షన్ లో ఒక హీరో పక్కన కూర్చున్నాను .. ఆ హీరో తన బూటుకాలు నాకు తగిలేలా కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు. సభామర్యాద .. సీనియర్స్ ను ఎలా గౌరవించాలి? అనేది ఈ తరంలో చాలా తక్కువమందికి తెలుసు" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News