Guntur: ఇద్దరితో వివాహేతర బంధం పెట్టుకున్న యువతి అనుమానాస్పద మృతి... వారి భార్యలే హత్య చేశారంటూ ఆరోపణలు!

  • గుంటూరు  జిల్లా యడ్లపాడు సమీపంలో ఘటన
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
  • విచారణ ప్రారంభించిన పోలీసులు

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం ఎస్సీ కాలనీలో పుల్లగూర శాంతి (29) అనే యువతి, గోడకు ఉన్న రాతి దూలానికి నవారుతో ఉరేసుకుని మరణించగా, అది హత్యని ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాలు, బంధువుల కథనం ప్రకారం, శాంతికి భర్త చిన్న అక్కియ్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా ఆమె సమీపంలోని మరో ఇద్దరు పురుషులతో వివాహేతర బంధం నడిపిస్తోంది. ఈ విషయంలో వారిద్దరి భార్యలకు, శాంతికి మధ్య వివాదం కూడా జరిగింది.

 ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆడుకుని ఇంటికి వచ్చిన శాంతి కుమార్తె జ్యోతి, తల్లి ఉరివేసుకుని ఉండటాన్ని చూసి కేకలు పెట్టింది. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసి, ఆమెను కిందకు దించగా, అప్పటికే చనిపోయి ఉంది. ఆ ఇద్దరు మహిళలే తన భార్యను హత్య చేశారని చిన్న అక్కియ్య, ఇతర బంధువులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News