India: నమ్మలేనంత నిర్లక్ష్యం... మూడున్నరేళ్లకు గమ్యస్థానం చేరిన రైలు బోగీ!

  • రైల్వేల నిర్లక్ష్యానికి పరాకాష్ట
  • ఎరువుల లోడుతో ఉన్న బోగీ మాయం
  • మూడున్నరేళ్లు కనిపెట్టలేకపోయిన అధికారులు

భారతీయ రైల్వేలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయన్న విషయానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండబోదేమో. 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యం చేరుకోవడానికి మూడున్నరేళ్ల సమయం పట్టిందంటే నమ్మగలరా? కలలోనైనా నమ్మలేనంత నిర్లక్ష్యమిది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దాదాపు 10 లక్షల విలువైన ఎరువులను ఇండియన్ పొటాష్ లిమిటెడ్ అనే సంస్థ విశాఖ పోర్టు నుంచి ఓ గూడ్స్ బోగీలో పార్శిల్ చేసింది. వాటిని అందుకోవాల్సిన రామచంద్ర గుప్తా అనే ఎరువుల షాపు యజమాని, ఎంతకూ తనకు చేరాల్సిన పార్సిల్ చేరకపోవడంతో, రైల్వే శాఖకు పలుమార్లు లేఖ రాశాడు.

ఆ రైలు బోగీ ఎక్కడుందో అధికారులు గుర్తించలేకపోవడంతో, ఈ మూడున్నర సంవత్సరాల పాటు ఆ బోగీ దేశమంతా తిరుగుతూనే ఉంది. రైల్వే స్టేషన్లను దాటుతున్నా, పక్క బోగీల్లో లోడింగ్, అన్ లోడింగ్ జరుగుతున్నా, ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. గుర్తించలేదు. చివరకు ఇటీవల దీన్ని గుర్తించి, చేరాల్సిన ప్రాంతానికి చేర్చగా, అప్పటికే దానిలోని ఎరువులన్నీ పాడైపోయాయి. దాన్ని తీసుకునేందుకు యజమాని నిరాకరించడంతో పట్టాలపైనే ఓ పక్కన ఉంచారు. ఇప్పుడు తనకు జరిగిన నష్టాన్ని రైల్వే శాఖే చెల్లించాలని రామచంద్ర గుప్తా డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News