Rajya Sabha: రాజ్యసభకు క్షమాపణలు చెప్పిన విజయసాయి రెడ్డి!

  • వెంకయ్యనాయుడికి మనస్తాపం కలిగేలా విజయసాయి వ్యాఖ్యలు
  • నేడు సభలో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వెంకయ్య
  • వెంటనే క్షమాపణలు చెప్పిన విజయసాయి రెడ్డి

రాజ్యసభ చైర్మన్ కు మనస్తాపం కలిగేలా తన వ్యాఖ్యలు ఉన్నందున సభకు క్షమాపణలు చెబుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తరువాత, నిన్న సభలో జరిగిన ఘటనపై మాట్లాడేందుకు విజయసాయికి చైర్మన్ వెంకయ్యనాయుడు అవకాశం ఇచ్చారు.

 ఆ సమయంలో మైక్ తీసుకున్న ఆయన, "కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఈ ఘటన జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరినీ కించపరచాలని..." అంటూ ప్రసంగిస్తుండటంతో, వెంకయ్య అడ్డుకున్నారు. జీరో అవర్ కు వెళ్లిపోతున్నామంటూ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ కు మైక్ ఇచ్చారు.

"ఆయన్ను పూర్తిచేయనివ్వండి" అని ఆజాద్ అనగా, "లేదు... తాను అన్న వ్యాఖ్యలను ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం లేని పని. మరో చర్చను కోరుకోవడం లేదు. నాకు క్షమాపణలు చెప్పించుకోవాలని, విచారం వ్యక్తం చేయించుకోవాలని ఏమాత్రం ఆసక్తి లేదు. విషయాన్ని సభ్యుడి విజ్ఞతకే వదిలేస్తున్నా" అన్నారు. ఆపై విజయసాయి మాట్లాడుతూ, "నిన్న జరిగిన ఘటనకు క్షమాపణలు చెబుతున్నా... దట్సాల్" అని ముగించారు.

More Telugu News