Chandrababu: ముందుచూపు వల్లే సాగునీటిని ఇవ్వగలిగాం: సీఎం చంద్రబాబు

  • నీరు - ప్రగతి, వ్యవసాయంపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ 
  • మరో పదిరోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది
  • రేపటి నుంచి రాయలసీమకు నీటిని విడుదల చేస్తాం

జూన్ లోనే కృష్ణా డెల్టా ఆయకట్టులో పంటలు వేయడం నూట యాభై ఏళ్ల డెల్టా చరిత్రలో రికార్డు అని, అదేవిధంగా, జులై 3వ వారంలోనే శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు సాగునీటిని ఇవ్వడం మరో రికార్డని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ‘నీరు - ప్రగతి, వ్యవసాయం’పై ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘ఇప్పుడిప్పుడే కృష్ణా నదిలోకి నీరు వస్తోంది. గోదావరిలో ఇప్పటికే 419 టీఎంసీలు సముద్రంలో కలిసింది. వంశధార, నాగావళికి వరద ప్రవాహం పెరిగింది. మరో పదిరోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది. రేపటి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని రాయలసీమకు విడుదల చేస్తాం. శ్రీశైలం రిజర్వాయర్ కు నీళ్లు చేరిన వెంటనే రాయలసీమకు సాగునీరు ఇచ్చే పరిస్థితి గతంలో లేదు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం వల్లే ఇది సాధ్యమైంది. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించి, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తేగలగడం భగీరథ ప్రయత్నమే. గత నాలుగేళ్లలో మన ముందుచూపు, కార్యాచరణ వల్లే ఇది సాధ్యమైంది. నదుల అనుసంధానం ద్వారా, నీరు - ప్రగతి, జలసంరక్షణ ఉద్యమం వల్ల దీనిని సాధించగలిగాం.

‘గతంలో సాగునీటి విడుదలపై గొడవలు జరిగేవి. గేట్లు ఎత్తాలని కొందరు, ఎత్తకూడదని మరికొందరు గొడవలకు దిగేవారు. అలాంటిది ఇప్పుడు పులివెందులకు కూడా నీళ్లివ్వగలిగాం అంటే అదంతా ప్రభుత్వం ముందు చూపు వల్లే సాధ్యమైంది. వర్షాభావంలో కూడా చీనీ తోటలు ఎండిపోకుండా చూడగలిగాం. శ్రీశైలంకు నీళ్లు చేరిన వెంటనే రాయలసీమకు నీళ్లిచ్చే పరిస్థితి తీసుకువచ్చాం. అటు నదుల అనుసంధానం, ఇటు జల సంరక్షణ చర్యల సత్ఫలితాలను రైతులకు చేరువ చేయగలిగాం’ అని పేర్కొన్నారు.

శ్రీశైలం డ్యామ్ కు 2,26,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని జలాశయ నీటిమట్టం 846.5 అడుగులకు చేరిందని, నీటినిల్వ 72.78 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే నాలుగైదు రోజులు ఇదే స్థాయిలో ఇన్ ఫ్లో ఉంటుందని, రోజుకు 8-10 టీఎంసీలు ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు వివరించారు. సింగనమల, రాప్తాడు మండలాల్లో 149 ఎకరాల్లో రెయిన్ గన్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, ‘వచ్చే ప్రతినీటి చుక్కను సద్వినియోగం చేయాలి. భూమినే జలాశయంగా మార్చుకోవాలి. స్మార్ట్ వాటర్ గ్రిడ్ కు వెళ్లాలి, సుస్థిర ఆర్ధికాభివృద్ధి సాధించాలి. రాయలసీమలో వర్షాభావ పరిస్థితి ఉంది. లోటు వర్షపాతం ప్రాంతాలలో రెయిన్ గన్స్ వాడాలి. రెయిన్ గన్, జిబా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటివరకు లక్ష టన్నుల మామిడిని సేకరించాం. ప్రభుత్వ స్పందనపై రైతుల్లో పూర్తిస్థాయిలో సంతృప్తి ఉంది. సకాలంలో రైతులను ఆదుకున్నాం. ఇదే స్ఫూర్తితో జ్యూస్ తయారీ కంపెనీలు కూడా సహకరించాలి. మామిడి రైతులను ఆదుకున్న జిల్లా యంత్రాంగానికి అభినందనలు’ అని అన్నారు.

ఒకవైపు హక్కుల కోసం పోరాటం.. మరోవైపు అభివృద్ధి కోసం కృషి

‘అక్కడ పార్లమెంటులో మన ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కోసం అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలి. ఒకవైపు హక్కుల కోసం పోరాటం .. మరోవైపు అభివృద్ధి కోసం కృషి జరగాలి. అన్ని శాఖల్లో మన కృషి ఫలిస్తోంది. సుస్థిర ఆర్ధికాభివృద్ధే మన లక్ష్యం కావాలి. నాలుగేళ్లలో వ్యవస్థలను పటిష్టంగా నిర్మించాం. సమర్ధంగా వ్యవస్థలను వినియోగించుకోవాలి. సత్ఫలితాలను సాధించాలి. వనరులు ఉన్నాయి, నిధులు సమీకరిస్తున్నాం. వాటి నిర్వహణలోనే మన సామర్ధ్యం బయటపడుతుంది’ అని చంద్రబాబు తెలిపారు.

‘నరేగాలో లేబర్ కాంపోనెంట్ లక్ష్యం చేరుకున్నాం. మెటీరియల్ కాంపోనెంట్ లక్ష్యం పూర్తి చేయాలి. పంటకుంటలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం ముమ్మరం చేయాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో జాతీయ అవార్డులలో అధికం మనమే సాధించాలి. ప్రతి శనివారం స్వచ్ఛదినంగా పాటించాలి. దేశంలోనే ఆరోగ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందాలి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.

More Telugu News