Krishna District: కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజాపై తెలుగుదేశం కార్యకర్తల దాడి... తీవ్ర ఉద్రిక్తత!

  • పోలవరం పరిశీలనకు బస్సుల్లో బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు
  • బస్సులను ఆపినందుకు వివాదం
  • ఫర్నీచర్, కంప్యూటర్ల ధ్వంసం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా కీసర వద్ద ఉన్న టోల్ ప్లాజాపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి వీరంగం సృష్టించారు. పోలవరం పరిశీలనకు కొన్ని బస్సుల్లో టీడీపీ కార్యకర్తలు బయలుదేరి వెళుతుండగా, టోల్ ప్లాజా వద్ద వాటిని ఆపిన సిబ్బంది డబ్బు చెల్లించాలని కోరడంతో వివాదం మొదలైంది. అధికార పార్టీ బస్సులనే ఆపుతారా? అంటూ, బస్సుల నుంచి కిందకు దిగిన పదుల సంఖ్యలో కార్యకర్తలు, టోల్ ప్లాజా సిబ్బందితో గొడవకు దిగారు.

అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను, అద్దాలను పగులగొట్టి, తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. సెక్యూరిటీ సిబ్బందిపై చెయ్యి చేసుకున్నారు. టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించామని, సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News