Telangana: అడవి పందితో రైతు హోరాహోరీ పోరు.. చివరికి రైతుదే విజయం.. ఆదిలాబాద్‌లో ఘటన

  • పొలంలో రైతుపై అడవి పంది దాడి 
  • ప్రాణాలకు తెగించి పోరాటం 
  • తీవ్రంగా గాయపడిన రైతు 

అడవి పందికీ-రైతుకు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరికి రైతు విజయం సాధించాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సంపత్‌నాయక్‌ తండాలో జరిగిందీ ఘటన. తండాకు చెందిన కటక్వార్ జైసింగ్ తన పత్తి పంటను పరిశీలించేందుకు పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ అడవి పంది జైసింగ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో దాని నుంచి తప్పించుకుని చేనులోకి వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.

అయితే, అక్కడే మాటువేసి ఉన్న పంది మరోమారు అతడిపై దాడికి దిగింది. ఇక తప్పించుకునే మార్గం లేదని గ్రహించిన రైతు, తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రాణాలకు తెగించి పోరాడాడు. పందికీ-రైతుకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరికి ఒడుపుగా పందిని కిందికి నెట్టిన రైతు దానిని కదలకుండా గట్టిగా నేలకేసి అదిమిపట్టాడు. దీంతో ఊపిరాడక పంది మరణించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతులు తీవ్రంగా గాయపడిన జైసింగ్‌ను ఆదిలాబాద్ ‘రిమ్స్‌’కు తరలించారు.

More Telugu News