Jagan: మంగళవారం నాడు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన జగన్!

  • రాష్ట్ర బంద్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి
  • చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకే బంద్
  • ఎంపీలు రాజీనామా చేస్తే మరో నిరాహారదీక్షకు రెడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ప్రజలను చంద్రబాబు సర్కారు మోసం చేస్తున్న కారణంగా, మంగళవారం, 24వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్టు వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఎక్కడికక్కడ బస్సులను, రహదారులను దిగ్బంధించాలని, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, తన ఎంపీలతో రాజీనామా చేయించేంత వరకూ తమ పార్టీ నిరసన కార్యక్రమాలు జరుపుతూనే ఉంటుందని అన్నారు.

టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేసి వస్తే, అందరమూ కలసి నిరాహార దీక్షకు కూర్చుని కేంద్రాన్ని కదిలిద్దామని, కిందకు దిగివచ్చి, రాష్ట్రానికి హోదాను ప్రకటించేలా చూద్దామని తెలిపారు. హోదా రావాలంటే, అంతకుమించిన మార్గం లేదని అన్నారు. బంద్ ను విజయవంతం చేస్తే, ఏపీ ప్రజలు కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారన్న సంకేతాలు వెళతాయని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ఉన్న సెంటిమెంట్ ను మిగిలిన పార్టీలకు కూడా తెలియజెపుదామని, ఆ స్థాయిలో బంద్ ను జరుపుదామని అన్నారు.

More Telugu News