Andhra Pradesh: ఏపీలో పెట్టుబడులను అడ్డుకునేందుకే ‘కన్నా’ కుట్ర!: డొక్కా మాణిక్యవరప్రసాద్

  • ఇటువంటి కుట్రలను కన్నా మానుకోవాలి
  • ఏపీలో శాంతిభద్రతలు భేష్
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అమాయకులపై దాడులు

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక, వెల్లువలా వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవడానికి ఏపీలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందంటూ కేంద్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఇటువంటి కుట్రలు, దుష్ప్రచారాలు మానుకుని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు.

సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందంటూ కేంద్ర హోం శాఖ మంత్రికి కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని, దొంగే దొంగన్నట్లుగా ఉందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఏపీలో శాంతి భద్రతలు లేవని చెబుతూ, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని చూస్తుండడం సరికాదని హితవు పలికారు.

సామాన్యులపైనా, ప్రజలపైనా వాళ్లే దాడులు చేసి, తిరిగి కేంద్రానికి ఫిర్యాదు చేయడం దారుణమని, పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతలు లేవని ప్రధాని నరేంద్రమోది, ఏపీలో పరిస్థితులు చేయిదాటి పోతున్నాయని ఇక్కడి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారని అన్నారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శాంతిభద్రతలపై ఉన్న శ్రద్ధ కాషాయ పార్టీ పాలిత రాష్ట్రాల్లో చూపితే బాగుంటుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయని, దళితులు, క్రైస్తవులను ఆంగ్లేయులని బీజేపీ ఎంపీలే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇవేవీ ప్రధాని నరేంద్రమోదీకి, కన్నా లక్ష్మీనారాయణకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.

జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, పాత్రికేయుల హత్యలు బీజేపీ నేతలకు కానరావడం లేదా? అని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం ఒంగోలులో ఆర్.ఎం.పి డాక్టర్ ప్లకార్డులు చేతబూని నిరసన తెలియజేస్తే, ఆయనపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు దాడికి పాల్పడ్డారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకు బాపట్లలో లారీ డ్రైవర్ పైనా విచక్షణారహితంగా దాడులు చేసింది బీజేపీ నేతలు కాదా? అని డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు.

ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం చంద్రబాబునాయుడి దృఢ వైఖరి చూసి, దాచేపల్లిలో బాలికపై అత్యాచార చేసిన  నిందితుడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని, జమ్మూకశ్మీర్ లో కథువాలో బాలికపై అత్యాచారం జరిపిన నిందితులతో కలిసి బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఉత్తరప్రదేశ్ లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బీజేపీ నేతలు దాడులు చేశారని, నేరస్తులకు వంతపాడడమే బీజేపీ పాలసీయా? అని డొక్కా మాణిక్యవరప్రసాద్ నిలదీశారు. ఇప్పటికైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు దిగజారడాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఖండించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపైనా, టీడీపీపైనా ఆరోపణలు చేయడంపై చూపెడుతున్న శ్రద్ధలో పది శాతం రాష్ట్రంపై పెట్టి, అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను దెబ్బతినేలా కేంద్రానికి ఫిర్యాదు చేసిన కన్నా తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు.

More Telugu News