Vizag: బట్టలు మార్చుకుని వస్తానని వెళ్లి, ఉరేసుకున్న 'నీట్' కోచింగ్ విద్యార్థిని... విశాఖలో ఘటన!

  • నీట్ ఒత్తిడికి మరో విద్యాకుసుమం బలి
  • ఇంటర్ వరకూ తెలుగు మీడియం, ఆపై ఇంగ్లీష్
  • పాఠాలు అర్థం కావడం లేదని డైరీలో రాసుకున్న అమృత

నీట్ ఒత్తిడికి మరో విద్యాకుసుమం బలైపోయింది. విశాఖపట్నం శివార్లలోని అశీలుమెట్ట వద్ద గ్రావిటీ ఐఐటీ-మెడికల్ అకాడమీలో లాంగ్ టర్మ్ కోచింగ్ నిమిత్తం 9వ తేదీన చేరిన అమృత (17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, విజయనగరం జిల్లాకు చెందిన రైతు మర్రి సాంబమూర్తి, అంగన్ వాడీ కార్యకర్త సుధారాణి దంపతుల కుమార్తె అమృత. ఆమెను డాక్టర్ ను చేయాలన్న కలతో వారు చదివిస్తున్నారు. నిన్న ఉయం స్నానం చేసి, దుస్తులు మార్చుకుని వస్తానని స్నేహితులతో చెప్పిన అమృత, లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. ఆపై ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, ఆమె ఉరేసుకుని మరణించింది. ఆమెకు హాస్టల్ నివాసం కొత్తేమీ కాదని తెలుస్తోంది. 8 నుంచి ఇంటర్ వరకూ అమృత హాస్టల్ లోనే ఉండి చదువుకుంది. తెలుగు మీడియంలో చదివిన అమ్మాయి, నీట్ కోచింగ్ ఇంగ్లీష్ మీడియంలో సాగుతుండటంతో ఒత్తిడిలో పడ్డట్టు తెలుస్తోంది. ఆమె రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కోచింగ్ బాగుందని, సబ్జెక్టు తనకు అర్థం కావట్లేదని, ఏడ్చేశానని రాసుకుంది. తన క్లాసులో చాలా మంది టాపర్స్ ఉన్నారని, జువాలజీ అర్థం కావట్లేదని రాసింది. కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News