Amit shah: ఇండియాలోనే ఆయన బెస్ట్ సీఎం: మధ్యప్రదేశ్ సీఎంపై అమిత్ షా ప్రశంసల జల్లు

  • ఉజ్జయిని నుంచి పార్టీ 51వ ఆశీర్వాద్ యాత్ర
  • ధైర్యం ఉన్న నేత అని కితాబు
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సీఎం అభ్యర్థే కరువయ్యారన్న చౌహాన్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలోనే ఆయన అత్యుత్తమ ముఖ్యమంత్రి అని కితాబిచ్చారు. ఇక మధ్యప్రదేశ్ ఎప్పటికీ వెనుకబడిన రాష్ట్రం కాదని తేల్చి చెప్పారు. ఉజ్జయిని నుంచి పార్టీ 51వ ఆశీర్వాద్ యాత్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న చౌహాన్ తన పనితీరుకు సంబంధించిన రిపోర్టును ప్రజల ముందు ఉంచాలన్న ఆయన ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. ‘‘ఈ విషయం చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. దేశంలోనే ఆయన బెస్ట్ సీఎం’’ అని షా పేర్కొన్నారు.

చౌహాన్ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలంలో తొలి పదేళ్లు యూపీఏ హయాంలో గడిచిపోయాయన్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం చౌహాన్‌కు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.3.44 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. గతంలో కేటాయించిన దానితో పోలిస్తే ఇది రెండింతలన్నారు.

చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థే కరువయ్యారని ఎద్దేవా చేశారు. వారు ఏ యాత్రలు చేపట్టినా ఫలితం ఉండదని, ఎందుకంటే దానిని నడిపించే నాయకుడు వారికి లేరని విమర్శించారు. కాంగ్రెస్ త్వరలోనే ‘పోల్ ఖోలో యాత్ర’ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుండడంతో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News