raghuveera reddy: ఏపీ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం: రఘువీరా

  • కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం
  • కాంగ్రెస్ ను వీడినవారంతా తిరిగి పార్టీలోకి రావాలి
  • రాహుల్ ప్రధాని అయితేనే ఏపీకి న్యాయం జరుగుతుంది

2019 ఎన్నికలకు గాను ఏపీ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ ను రెడీ చేస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. 55 నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేయబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. అనంతరం మీడియాతో రఘువీరా మాట్లాడుతూ, కిరణ్ ను కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో, భావోద్వేగంతోనే కిరణ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారని... ఎప్పటికీ ఆయన కాంగ్రెస్ నాయకుడేనని తెలిపారు. కాంగ్రెస్ ను వీడిన నేతలంతా మళ్లీ సొంత గూటికి రావాలని కోరారు.

ఏపీని కేవలం రాహుల్ గాంధీ మాత్రమే ఆదుకోగలరని... రాహుల్ ప్రధాని అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని రఘువీరా తెలిపారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటినీ కాంగ్రెస్ నెరవేరుస్తుందని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం పొందుతుందని ధీమాగా అన్నారు. 

More Telugu News