shasi tharur: శశిధరూర్.. మీకు పిచ్చి పట్టింది, పాకిస్థాన్ వెళ్లిపొండి!: సుబ్రహ్మణ్యస్వామి సలహా

  • భారత్ ‘హిందూ పాకిస్థాన్’గా మారుతుందన్న శశిధరూర్
  • మండిపడ్డ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి
  • ఎంపీగా శశిధరూర్ ఇలా మాట్లాడటం తగదన్న స్వామి

‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశం ‘హిందూ పాకిస్థాన్’గా మారుతుంది. భారత రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసి బీజేపీ ప్రభుత్వం తమ సొంత చట్టాలను అమల్లోకి తెస్తుంది’ అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిధరూర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, శశిధరూర్ చేసిన వ్యాఖ్యలపై తాను ఆశ్చర్యపోయానని, ఆయనకు పిచ్చిపట్టిందని.. పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని అన్నారు. శశధరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పాక్ జర్నలిస్టు మెహర్ తరార్ తో శశిధరూర్ కు సంబంధాలున్నాయంటూ వచ్చిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. శశిధరూర్ ఎవరి కోసమైతే తన భార్య సునందా పుష్కర్ ను బాధించారో, ఆ వ్యక్తి కూడా పాకిస్తానీయేనని, ఆయన ఇంకా అలాంటి అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్టయితే, ఆయన్ని పాక్ వెళ్లమనడంలో ఎలాంటి తప్పు లేదని స్వామి అన్నారు. బీజేపీ అధికారంలోకొస్తే మన దేశం ‘హిందూపాకిస్థాన్’ అవుతుందని ఆరోపిస్తున్న శశిధరూర్ ఇటీవల ఆయన రాసిన ‘నేనెందుకు హిందువునయ్యాను’ పుస్తకం గురించి సుబ్రహ్మణ్య స్వామి ప్రస్తావించారు. ఓ ఎంపీ అయి ఉండి శశిధరూర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇలాంటి వ్యాఖ్యల వల్ల మన దేశానికి ఎంత ప్రమాదం? అని  ప్రశ్నించారు.

More Telugu News