father: వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ఏకంగా తండ్రినే లేపేసింది!

  • 2011లో భర్తను కోల్పోయిన నిందితురాలు
  • స్టౌవ్ మెకానిక్ తో వివాహేతర సంబంధం
  • ప్రియుడితో కలిసి తండ్రిని హతమార్చిన వైనం

వివాహేతర సంబంధం వద్దంటూ అడ్డు తగులుతున్న తండ్రిని... ప్రియుడితో కలసి మట్టుబెట్టిందో కూతురు. ఈ దారుణ ఘటన కృష్ణాజిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిని లింగమనేని శేషుకుమారి భర్త 2011లో చనిపోయాడు. కుమారుడి చదువు కోసం ఆమె నూజివీడులోని తుమ్మలవారి వీధిలో అద్దెకు ఉంటోంది. ఆమె తండ్రి కూడా కుమార్తె వద్దే ఉంటూ ఓ హోటల్ లో పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో గ్యాస్ స్టౌవ్ మెకానిక్ వేముల వెంకటేశ్వరరావుతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది మంచి పద్ధతి కాదని ఆమెను తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. దీంతో ఆయన అడ్డు తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. జూన్ 30న రాత్రి పది గంటల సమయంలో తన ప్రియుడితో కలసి ఇంట్లో ఆమె ఉండటాన్ని తండ్రి గమనించాడు. కేకలు వేశాడు. దీంతో, ఇద్దరూ ఆయన నోరు నొక్కి ఊపిరి ఆడకుండా చేశారు. అనంతరం ఇనుపరాడ్డుతో తలపై కొట్టి, చంపేశారు. శవాన్ని ఉదయాన్నే కారు డిక్కీలో వేసుకుని దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నిమ్మగడ్డ రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

గుర్తు తెలియని మృత దేహంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు చూసి, తండ్రిని గుర్తు పట్టి వచ్చామని పోలీసులతో నమ్మబలికింది. పింఛను కోసం తన తండ్రి వెళ్లాడని, ఫోన్ కూడా తీసుకెళ్లలేదని చెప్పింది. అనంతరం శవాన్ని ఖననం చేయించి వెళ్లిపోయింది.

అనుమానం వచ్చిన పోలీసులు కాల్ డేటాను, నూజివీడు నుంచి శవం పడేసిన స్థలం వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో, మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. శేషుకుమారి, ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండుకు తరలించారు. 

More Telugu News