Hyderabad: ఇంట్లో మద్యం షాపు నిర్వహిస్తున్న అత్తను పట్టించిన కోడలు... మరుసటి రోజే పిల్లలతో కలిసి అదృశ్యం!

  • ఇంట్లో బెల్టు షాపు నిర్వహిస్తున్న అత్త
  • భర్తతో ఫిర్యాదు చేయించిన కోడలు
  • భార్యపై చేయిచేసుకున్న భర్త

ఇంట్లో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న అత్తను పోలీసులకు పట్టించిన కోడలు, తన ఇద్దరు పిల్లలతో కలిసి మాయమైంది. తన తల్లిని పోలీసులకు పట్టించడాన్ని జీర్ణించుకోలేని భర్త.. భార్యను చితకబాదడంతో ఆమె అదృశ్యమైంది. హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పార్థీ బస్తీలో నివసించే అరుణ్ తల్లి విజయ కళ (55) ఇంట్లోనే బెల్ట్ షాపు నిర్వహిస్తోంది. మందుబాబుల రాకతో ఇల్లు నిత్యం రద్దీగా ఉండడంతోపాటు వారి వెకిలి చేష్టలు భరించలేకపోయిన అరుణ్ భార్య మమత (30) భర్తను నిలదీయడమే కాక, అతడిని తీసుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణ్ ఇంటిపై దాడిచేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన విజయ పరారైంది.

తల్లి పరారు కావడం, తనతోనే ఫిర్యాదు చేయించడాన్ని తట్టుకోలేకపోయిన అరుణ్ భార్య మమతపై చేయిచేసుకుని తీవ్రంగా గాయపరిచాడు. దీంతో మనస్తాపానికి గురైన మమత కుమార్తె కుషిక (6), కుమారుడు నైతిక్ (4)తో కలిసి అదృశ్యమైంది. ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న విజయకళ కోసం గాలిస్తున్నారు.

More Telugu News