Chandrababu: చంద్రబాబు నన్ను మానసికంగా చంపేశారు.. ఆయన ఓడిపోవాలనే కాలినడకన తిరుమలకు: మోత్కుపల్లి

  • ఎన్టీఆర్ దయతో పార్టీలోకి వచ్చా
  • ఆయన పేదల కోసం పార్టీ పెడితే ఈయన పెత్తందార్ల పరం చేశారు
  • చంద్రబాబు వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను మానసికంగా చంపేశారని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పలు విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు పేదల కోసం పెట్టారని, కానీ చంద్రబాబు దానిని పెత్తందార్ల పరం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ దయతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న తనను చంద్రబాబు మానసికంగా చంపేశారని అన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం దారుణమైన విషయమన్నారు. రాజకీయాల్లో సేవలకు మాత్రమే చోటు ఉండాలని, దుర్మార్గులకు కాదని అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదనే తాను కొండపైకి కాలి నడకన వెళ్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని మోత్కుపల్లి పిలుపు ఇచ్చారు.

More Telugu News