Telangana: ఈ రాజకీయాలు నాకొద్దు: టీఆర్ఎస్ నేత సోమారపు సంచలన ప్రకటన!

  • రాజకీయ సన్యాసం తీసుకుంటాను
  • పదవులకు రాజీనామా చేస్తా
  • ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ

గోదావరి ఖని ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ గా సేవలందిస్తున్న సోమారపు సత్యనారాయణ ఈ ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు తగినంత గౌరవం దక్కడం లేదని, తన పదవులకు రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకోనున్నానని ఆయన తెలిపారు. రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ చేస్తున్న పార్టీ వ్యతిరేక పనులను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా, చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం నాడు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగగా, సోమారపు వర్గం మూడు స్థానాలను, మేయర్ వర్గం ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి గెలుచుకుంది. అంతకుముందు శుక్రవారం నాడు 41 మంది కార్పొరేటర్లు మేయర్ పై అవిశ్వాసం పెట్టగా, సోమారపు సత్యనారాయణ వెనకుండి అవిశ్వాస తతంగాన్ని నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. గత వారంలో కేటీఆర్ రెండు గ్రూపుల నేతలనూ పిలిచి మాట్లాడినా రామగుండంలో పరిస్థితి మారలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన సోమారపు, తాను రాజకీయాలను వదిలేయనున్నానని ప్రకటన చేయడం గమనార్హం.

More Telugu News