Mahidhar Reddy: 11న వైసీపీలో చేరనున్నాను: మాజీ మంత్రి మహీధర్ రెడ్డి

  • టీడీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం
  • కార్యకర్తల అభీష్టం మేరకు వైకాపాలో చేరాలని నిర్ణయం
  • తిరుపతిలో మీడియాతో మహీధర్ రెడ్డి

ఈ నెల 11వ తేదీ ఉదయం పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ను కలిసి వైకాపాలో చేరనున్నట్టు మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి ప్రకటించారు. నిన్న సాయంత్రం తిరుపతిలో ఎంపీ విజయసాయిరెడ్డి, వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిలతో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగుదేశం పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని విమర్శలు గుప్పించారు.

తిరుపతి తీర్థకట్ట వీధిలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన ఆయన, సాయి ఆశీస్సులు తనకు ఉన్నాయని, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నానని అన్నారు. నిత్యమూ ప్రజలతో మమేకమై, వారి సమస్యలు తీర్చే ప్రయత్నం చేసే మహీధర్ రెడ్డి, వైకాపాలో చేరడం సంతోషంగా ఉందని విజయసాయి వ్యాఖ్యానించారు.

More Telugu News