bjp: తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిన బీజేపీని తరిమితరిమి కొట్టండి: సీపీఐ, సీపీఎం

  • ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
  • అన్నీ నెరవేర్చినట్టు సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించారు
  • రాష్ట్రం నుంచి బీజేపీని వెలివేయాలి

ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని, ఇకపై ఇవ్వాల్సింది ఏమీ లేదని సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్ ను కేంద్ర ప్రభుత్వం సమర్పించిందని... రాష్ట్రానికి మోసం చేస్తున్న బీజేపీని తరిమితరిమి కొట్టాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో వామపక్ష పార్టీలు నేడు నిరసన ప్రదర్శనను నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా, పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ, ఉత్తరాంధ్ర-రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఓట్లు వేయించుకున్న బీజేపీ... గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. హామీలన్నింటినీ నెరవేర్చినట్టు తప్పుడు అఫిడవిట్ ను సమర్పించిందని తెలిపారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి, ప్రజలను మోసం చేసిన బీజేపీని వెలివేయాలని అన్నారు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవిఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్, సెంట్రల్ పార్క్ వరకు వామపక్షాల నిరసన ర్యాలీ కొనసాగింది. 

More Telugu News