Rape: బీహార్‌లో దారుణాతి దారుణం.. బాలికపై 15 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్ కలిసి ఏడు నెలలపాటు అత్యాచారం!

  • బాలికపై పాశవికంగా లైంగిక దాడి
  • ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే ఆయన కూడా అత్యాచారం
  • పోలీసుల అదుపులో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు, విద్యార్థులు

బీహార్‌లో ఏడు నెలలుగా జరుగుతున్న అత్యంత దారుణ విషయం ఒకటి బయటపడింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై 15 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ కలిసి ఏడు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యంత భయానకమైన ఈ విషయాన్ని బాధిత బాలిక శుక్రవారం బయటపెట్టింది. స్కూలు ఆవరణలోనే 15 మంది విద్యార్థులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు తెలిపింది. ఏడు నెలలుగా తనపై అత్యాచారం జరుగుతూనే ఉందని శుక్రవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సురాన్ జిల్లా కేంద్రమైన చాప్రాలో ఈ ఘటన జరగడం అందరినీ విస్మయ పరుస్తోంది.

బాలిక ఫిర్యాదుతో పోలీసులు ప్రైవేటు స్కూలు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. గతేడాది డిసెంబరులో తనపై తొలిసారి అత్యాచారం జరిగిందని, ఆ ఘటనను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత మిగతా విద్యార్థులు కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది.  స్కూలు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే ఆయన మరో ఇద్దరు ఉపాధ్యాయులతో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. శుక్రవారం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు సర్దార్ ఆసుపత్రిలో చేర్చారు. త్వరలోనే నివేదిక రానుంది.

More Telugu News