Pawan Kalyan: ఆంధ్రజ్యోతి ఎండీ కేసులో... పవన్‌ కల్యాణ్‌కు సమన్లు.. 24న కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశం

  • పవన్ పై విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి
  • ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను విమర్శిస్తూ వరుసగా ట్వీట్లు చేసిన పవన్
  • పరువు నష్టం దావా వేసిన రాధాకృష్ణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కోర్టు సమన్లు జారీ అయ్యాయి. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు 3వ అదనపు జడ్జి ఈ సమన్లను జారీ చేశారు. ఈ నెల 24న స్వయంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ కోర్టుకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు.

కేసు వివరాల్లోకి వెళ్తే, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సినీ నటి శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల ఆమె మండిపడ్డారు. అతని తల్లిని కించపరిచేలా ఓ పదాన్ని వాడారు. ఈ ఘటనకు సంబంధించి మీడియా చానళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి 23 వరకు పవన్ కల్యాణ్ వరుసగా అనుచిత ట్వీట్లు చేశారు.

తన తల్లిని ఎవరో దూషించిన విషయాన్ని ఉపయోగించుకుని రాధాకృష్ణ మైలేజీ పొందాలనుకున్నారంటూ పవన్ విమర్శించారు. కొన్ని ఫొటోలను కూడా అప్ లోడ్ చేశారు. దీంతో, పవన్ కు తన లాయర్ ద్వారా రాధాకృష్ణ నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే, ఈ నోటీసులకు పవన్ స్పందించకపోవడంతో... రాధాకృష్ణ ఆయనపై రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. 

More Telugu News