Chennai: ఇష్టం లేని వివాహాన్ని నిశ్చయించిన తల్లిదండ్రులు... తొమ్మిదంతస్తుల భవనంపై నుంచి దూకేసిన టెక్కీ!

  • చెన్నైలో పని చేస్తున్న ఏపీ యువతి ప్రియాంక
  • ఇటీవలే ఆమెకు నిశ్చితార్థం
  • కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించిన పోలీసులు

తనకు ఇష్టం లేని వివాహం నిశ్చయించారన్న మనస్తాపంతో సంచలన నిర్ణయం తీసుకుందో యువతి. బంధువులకు ఫోన్ చేసి "మీకో సర్ ప్రైజ్ ఇస్తా" అని చెప్పిన నిమిషాల్లోనే తొమ్మిది అంతస్తుల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలో తాను పని చేస్తున్న సాఫ్ట్ వేర్ కార్యాలయంపై నుంచి దూకింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఏపీకి చెందిన ప్రియాంక (27) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు ఇటీవల తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో, దొరైపాక్కం ప్రాంతంలోని ఆఫీసు భవంతిపైకి ఎక్కిన ప్రియాంక, తన బంధువులకు ఫోన్ చేసి, ఆపై కిందకు దూకేసింది. సహోద్యోగుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె ఎటువంటి ఆత్మహత్యా లేఖ రాయలేదని, ఆమె కంప్యూటర్ ను పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ప్రియాంక కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

More Telugu News