Mumbai: అపార ప్రాణ నష్టాన్ని నిలువరించిన లోకో పైలట్.. బ్రేక్ వేయడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే..!

  • ప్రమాదాన్ని ముందే శంకించిన లోకోపైలట్
  • ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో తప్పిన పెను ప్రమాదం
  • అభినందించిన కేంద్ర మంత్రి
  • రూ.5 లక్షల బహుమానం

డ్రైవర్‌కు సమయస్ఫూర్తి ఎంత అవసరమో కళ్లకు కట్టిన ఘటన ఇది. ఆలోచించడం ఒక్క క్షణం లేటైనా, నిర్ణయం తీసుకోవడంలో క్షణకాలం ఆలస్యమైనా పెను ప్రమాదమే జరిగి ఉండేది. మంగళవారం ఉదయం ముంబైలోని అంధేరీ ఈస్ట్, అంధేరీ వెస్ట్‌లను కలిపే వంతెన కుప్పకూలింది. దీంతో స్టేషన్‌లోని  ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అదే సమయంలో పట్టాల పైకి లోకల్ ట్రైన్ దూసుకొస్తోంది. ప్రమాదాన్ని ముందే శంకించిన లోకో పైలెట్ చంద్రశేఖర్ సావంత్ క్షణంలోని పదో వంతులో ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అంతే.. ప్రమాద స్థలానికి కొద్ది దూరం ముందు రైలు ఆగింది. లేదంటే పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి.  

ఈ ఘటనపై సావంత్  మాట్లాడుతూ.. బ్రిడ్జిలోని ఓ భాగం కూలిపోవడాన్ని తాను గమనించానని, రైలు కనుక మరికొంత ముందుకు వెళితే ప్రమాదమని భావించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించానని వివరించాడు. తమ ప్రాణాలు కాపాడిన సావంత్‌కు ప్రయాణికులు అభినందించారు. ప్రమాద స్థలికి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విషయం తెలిసి సావంత్‌ను మెచ్చుకున్నారు. అతడి సమయస్ఫూర్తికి అభినందనలు తెలిపారు. అంతేకాదు, రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.

More Telugu News