Kadiam Srihari: తెలంగాణ ఉపాధ్యాయ బదిలీల్లో.. ఆప్షన్లు ఎంచుకోవడంలో తప్పులు దొర్లిన వారికి ఎడిట్ చేసుకునే అవకాశం!

  • 3వ తేదీన హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు ఎడిట్ ఆప్షన్
  • 4వ తేదీన ఎస్‌జీటీలకు అవకాశం
  • ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఎడిట్ అవకాశం
  • వివరించిన మంత్రి కడియం శ్రీహరి

తెలంగాణ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా వెబ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్లు ఎంచుకోవడంలో దొర్లిన తప్పులు సరిచేసుకోవడానికి, ఫ్రీజ్ అయిన తరువాత జంబ్లింగ్ జరిగిందనే అనుమానముంటే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. చాలా మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లను ఎంచుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లారని, అక్కడ ఆప్షన్లు ఎంచుకోవడంలో పొరపాటున తప్పులు దొర్లాయని, ఫ్రీజ్ అయిన తరువాత ఆప్షన్లలో జంబ్లింగ్ జరిగిందనే అనుమానాలు కొంతమంది టీచర్లకున్నాయని, వాటిని సరిచేసుకునేందుకు ఎడిట్ అవకాశం ఇవ్వాలంటూ ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు నేడు కడియం శ్రీహరిని సచివాలయంలో కలిసి అభ్యర్థించారు.

వెబ్ ఆప్షన్లలో ఈ ఎడిట్ అవకాశం కల్పిస్తే చాలా మంది ఉపాధ్యాయులకు జరిగిన పొరపాట్లు సరిచేసుకునే వీలు కలుగుతుందని, తద్వారా టీచర్లందరికీ న్యాయం జరుగుతుందని కడియం శ్రీహరిని కోరారు. దీనిపై తాను సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బందితో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని ఉపాధ్యాయ సంఘాలకు కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయుల బదిలీలలో వెబ్ ఆప్షన్లలో ఎడిట్ అవకాశంపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్‌.ఆచార్య, పాఠశాల విద్యాశాఖ ఇన్ ఛార్జ్ కమిషనర్ అధర్ సిన్హా, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, సాంకేతిక సిబ్బందితో సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు.  

ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాల అభ్యర్థన మేరకు టీచర్ల బదిలీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడంలో తప్పులు దొర్లిన, జంబ్లింగ్ జరిగిందని అనుమానముంటే ఎడిట్ ఆప్షన్ కల్పించాలని నిర్ణయించారు. వెబ్ కౌన్సిలింగ్ లో ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరగకూడదని, పూర్తి పారదర్శకంగా ఈ బదిలీల ప్ర్రక్రియ జరగాలనే ఉద్దేశంతోనే ఈ ఎడిట్ అవకాశం కూడా కల్పిస్తున్నామన్నారు.

ఈ నెల 3వ తేదీన ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు, 4వ తేదీన
ఎస్జీటీలకు ఈ ఎడిట్ అవకాశం ఉంటుందని ప్రకటించారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పులు సరిదిద్దుకోవచ్చని, అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఆప్షన్లు ఎంచుకొని ఫ్రీజ్ చేసిన తర్వాత జాబితా, ఎడిట్ అవకాశం వినియోగించుకుని ఫ్రీజ్ చేసిన తర్వాత ఆప్షన్ల జాబితా రెండు కూడా భద్రంగా కంప్యూటర్ సర్వర్లో నిక్షిప్తం చేస్తున్నామని తెలిపారు.

‘‘ఉపాధ్యాయుల బదిలీల వెబ్ కౌన్సిలింగ్ లో 2193 ప్రధానోపాధ్యాయుల్లో 2182 మంది (99.49 శాతం) మంది కౌన్సిలింగ్ లో పాల్గొని తమ వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. అదే విధంగా 31968 మంది స్కూల్ అసిస్టెంట్లలో 31,483 మంది స్కూల్ అసిస్టెంట్లు (98.48శాతం) వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. 40,729 మంది ఎస్జీటీల్లో 39,054 మంది (95.88) వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు, ఎస్జీటీలలో 90 మంది తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు ఆప్షన్లు ఎంచుకోలేదు’’ అని అధికారులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వివరించారు.

బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వ్యక్తిగతంగా ఎవరికైనా ఫిర్యాదులుంటే వారు నేరుగా విద్యాశాఖ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం దానిని విచారించి న్యాయం చేస్తామని ఆయన ఇచ్చారు. అదేవిధంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో టీచర్లు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లు పొందినట్లు విచారణలో తేలితే వారి బదిలీ ఉత్తర్వులు రద్దు చేసి, శాఖాపర చర్యలు తీసుకుంటామన్నారు.

వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవడంలో ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సాంకేతిక సిబ్బందికి కడియం శ్రీహరి సూచించారు. ఈ మొత్తం బదిలీల ప్రక్రియలో ఎక్కడా కూడా చిన్న నిర్లక్ష్యం, పొరపాటులకు కూడా అవకాశం ఇవ్వకుండా పనిచేయాలన్నారు.

  • Loading...

More Telugu News