indira gandhi: ఒక్క నిర్ణయం కారణంగా ఇందిర సేవలను విస్మరిస్తారా?: బీజేపీపై శివసేన ఫైర్

  • దేశం అస్తవ్యస్తంగా ఉందనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు
  • మహనీయులను తక్కువ చేయాలనుకోవడం మంచిది కాదు
  • దేశానికి ఇందిర చేసినంత మరెవరూ చేయలేదు
  • కాంగ్రెస్ ను చూసి మోదీ, అమిత్ షాలు భయపడుతున్నారు

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీని బీజేపీ మరోసారి చర్చనీయాంశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీలపై శివసేన మండిపడింది. 1975లో తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఇందిరని విమర్శించడం తగదని... దేశానికి ఆమె చేసిన సేవలను ఎలా విస్మరిస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. వాస్తవానికి ప్రజాస్వామ్యానికి ఇందిర ఎంతో గౌరవం ఇచ్చారని... ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. దేశానికి ఎంతో చేసిన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్ లాంటి మహనీయులను తక్కువ చేసి చూపించాలనుకోవడం సరైంది కాదని అన్నారు.

దేశానికి ఇందిర చేసినంత గొప్పగా మరెవరూ చేయలేకపోయారని సంజయ్ రౌత్ తెలిపారు. కేవలం ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని, ఆమెపై చెడుగా ముద్ర వేయాలనుకోవడం తగదని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయని... ఆ నిర్ణయాలు కరెక్టా? తప్పా? అనేది ఎవరైనా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. తప్పని పరిస్థితుల్లోనే ఇందిర ఎమర్జెన్సీని విధించి ఉండవచ్చని చెప్పారు.

ఇందిర ఎమర్జెన్సీని విధించిన రోజును బ్లాక్ డేగా నిర్వహించాలని అనుకుంటే... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో బ్లాక్ డేలను నిర్వహించాల్సి ఉంటుందని రౌత్ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన రోజును కూడా బ్లాక్ డేగా జరుపుకోవాలని చెప్పారు. నోట్ల రద్దుతో ఎంతో మంది సామాన్యులు కొన్ని రోజుల పాటు ఉపాధిని కోల్పోయారని విమర్శించారు. చిన్నచిన్న వ్యాపారులు ఎంతో నష్టపోయారని, నల్ల కుబేరుల డబ్బు వైట్ గా మారిందని దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తుందని ప్రధాని మోదీ చెప్పారని... కానీ, డబ్బు కోసం క్యూలలో నిలబడి ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారని మండిపడ్డారు.

జమ్ముకశ్మీర్ లో శాంతిని నెలకొల్పుతామంటూ బీజేపీ గొప్పలు చెప్పుకుందని... కానీ, కశ్మీర్ లోయ ఇప్పుడు మరింత భయానకంగా తయారయిందని రౌత్ విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉన్న ఓ బ్యాంకు... నోట్ల రద్దు సమయంలో కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ. 575 కోట్లను మార్పిడి చేసిందని మండిపడ్డారు. నోట్ల రద్దు ప్రభావం నుంచి దేశం ఇంకా బయటపడలేదని అన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రెస్ కు స్వాతంత్ర్యం లేకుండా చేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని... కానీ, నాలుగు దశాబ్దాల క్రితం ఎమర్జెన్సీకి, ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఏమాత్రం తేడా లేదని రౌత్ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అద్వానీని జైల్లో పెట్టారని... ఇప్పుడు కనీసం మాట్లాడలేని స్థితిలోకి ఆయనను నెట్టేశారని విమర్శించారు. బీజేపీలోని ఎంతో మంది సీనియర్ నేతలు మౌనంగా ఉండిపోయేలా చేశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీకన్నా ఇది అత్యంత దారుణమైన పరిస్థితి అని అన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో బాధలను అనుభవించిన జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వారికి మాత్రమే... ఎమర్జెన్సీ తీవ్రత గురించి మాట్లాడే హక్కు ఉందని సంజయ్ రౌత్ చెప్పారు. ఆ సమయంలో ఫెర్నాండెజ్ జైలుకు వెళ్లడం మాత్రమే కాదు, ఇందిర ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు విప్లవాన్ని తీసుకొచ్చేందుకు కూడా విశ్వప్రయత్నం చేశారని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పుట్టనివారు, బుడిబుడి అడుగులు వేస్తున్నవారు కూడా దాని గురించి మాట్లాడుతుండటం బాధాకరమని చెప్పారు. తాను ఎమర్జెన్సీని సపోర్ట్ చేయడం లేదని ఇదే సమయంలో వ్యతిరేకించడం లేదని అన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో సివిల్ సర్వీసెస్ అధికారులు సమయానికి కచ్చితంగా కార్యాలయాలకు వచ్చేవారని, పరిపాలన సక్రమంగా జరిగిందని రౌత్ చెప్పారు. పేరుమోసిన డాన్లు హాజీ మస్తాన్, కరీమ్ లాలా, యూసుఫ్ పటేల్, వరదరాజన్ లాంటి వాళ్లు ఎమర్జెన్సీ సమయంలో కటకటాలు లెక్కపెట్టారని... ఇప్పుడు కోట్లు కొల్లగొట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు దర్జాగా విదేశాలకు చెక్కేస్తున్నారని దుయ్యబట్టారు.

అస్తవ్యస్తంగా ఉన్న దేశాన్ని గట్టెక్కించేందుకే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారని రౌత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు భయపడుతున్నారని... అందుకే ఇందిరాగాంధీని పదేపదే టార్గెట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వీరిద్దరి మానసికి స్థితికి వీరి వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. వారు చేసిన అభివృద్ధి గురించి బీజేపీ ప్రభుత్వం చెప్పుకోవాలని... 1975లో విధించిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. 

More Telugu News