Lovers: తన సీనియర్ గోపిని నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్న చంద్రిక... పరువు హత్యేనని తేల్చిన పోలీసులు!

  • ఇంటర్ చదివే రోజుల నుంచి ప్రేమలో చంద్రిక
  • ప్రియుడు గోపీని విచారించిన పోలీసులు
  • పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుందామని భావించిన జంట
  • ఆగ్రహంతో కొట్టి చంపిన తండ్రి

 తన కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తోందన్న ఆగ్రహంతో, హత్యకు పాల్పడిన కసాయి తండ్రి కేసులో పోలీసులు మరిన్ని వివరాలను వెల్లడించారు. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో చంద్రిక, తనకు సీనియర్ అయిన ఉన్నం గోపీ మనోహర్ అనే అతన్ని ప్రేమించిందని, వారి ప్రేమ ఇంటర్ తరువాత కూడా సాగిందని పోలీసు అధికారులు తెలిపారు. తాము గోపీ మనోహర్ ను విచారించామని చెప్పిన అధికారులు, చదువులు పూర్తయ్యాయి కాబట్టి, ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారని, చంద్రిక తన తండ్రికి విషయం చెప్పిందని, ఆపై పట్టరాని ఆగ్రహంతోనే ఆయన దారుణంగా కొట్టాడని తెలిపారు. దీంతో తీవ్ర గాయాల పాలైన చంద్రిక మరణించిందని అన్నారు.

కాగా, ఈ విషయంలో నిందితుడు తొండెపు కోటయ్య కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. కోటయ్య తన భార్య పద్మావతితో గొడవ పడుతూ ఉంటే, చంద్రిక అడ్డు వెళ్లిందని, ఆ సమయంలో పొరపాటున ఓ కర్ర ఆమెకు తగలగా, ప్రమాదవశాత్తూ మరణించిందని చెబుతున్నారు. అయితే, తలపై ఒక్క దెబ్బ కొడితే, ముఖంపై గాయాలు ఎలా అయ్యాయని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని, కుటుంబ పెద్దను కాపాడుకోవడం కోసం ఇంటి వారు అసత్యాలు చెబుతున్నారని పోలీసులు అంటున్నారు. నిజానిజాలు విచారణలో వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం కోటయ్య పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

More Telugu News