Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ముందే మోదీ హామీ ఇచ్చారు: చంద్రబాబు

  • గత ఎన్నికల ముందు తిరుపతిలో మోదీ హామీలిచ్చారు  
  • ఈరోజు పవన్‌ ఆ హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడరు
  • ఇటీవల మీటింగు పెట్టి నన్ను విమర్శించారు
  • కేంద్రం ఇచ్చిన డబ్బులతో హైకోర్టు భవనాన్ని కూడా కట్టలేం

గత ఎన్నికల ముందు తిరుపతిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముందే నరేంద్ర మోదీ ఏపీకి హామీలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు పవన్‌ ఆ హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు. ఇటీవల మీటింగు పెట్టి తనను విమర్శిస్తూ, కేంద్ర సర్కారుని మాత్రం ఒక్క మాట కూడా అనలేదని, ధర్మం, న్యాయాలతో ముందుకు పోవాలి కానీ ఇలా చేయకూడదని హితవు పలికారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూ మైదానంలో టీడీపీ ధర్మపోరాట సభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కేంద్ర సర్కారుపై పిడికిలి బిగించి పోరాడదామని... అంతిమ విజయం మనదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో హైకోర్టు భవనాన్ని కూడా కట్టలేమని అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని, అది ఆంధ్రుల హక్కని అన్నారు.

వాజ్‌పేయీ సంకల్పం నదుల అనుసంధానమని, పట్టిసీమ ద్వారా తాము అది చేశామని, ఇప్పటి కేంద్ర ప్రభుత్వం మాటలు చెబుతోంది కానీ, చేతలు లేవని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆనాడు తాను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని, ఇప్పుడు అదే సంకల్పంతో అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పారు.             

More Telugu News