Visakhapatnam District: ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై న‌డుం బిగించిన ఏకైక నాయ‌కుడు పవన్ కల్యాణ్: వంగపండు

  • చిన్న‌ప్ప‌టి నుంచి ఎన్నో పార్టీల‌ను, ఎంద‌రో నాయ‌కుల‌ను చూశా 
  • వాళ్ళు మాటలు చెప్పి వెళ్లిపోయారు
  • పవన్ కల్యాణ్ లో చిత్తశుద్ధి ఉంది

ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై పోరాటానికి న‌డుం బిగించిన ఏకైక నాయ‌కుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అని ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు ప్రశంసించారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులతో 'జనస్వరం' పేరిట ఈరోజు చర్చ కార్యక్రమం చేపట్టారు. ఈ చర్చా కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స లర్ కేఎస్ చలం సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వంగపండు మాట్లాడుతూ, చిన్న‌ప్ప‌టి నుంచి ఎన్నో పార్టీల‌ను, ఎంద‌రో మ‌హా నాయ‌కుల‌ను చూశానని, వాళ్ళు వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోయారే తప్పా చేసిందేమీలేదని విమర్శించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి నాయ‌కుడిని చూడ‌లేదని, ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై, స‌మ‌స్య‌ల ప‌రిష్క‌ారానికి చిత్త‌శుద్ధితో ఆయన కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ చలం మాట్లాడుతూ, ‘ఓ వైపు కొండలు... మరో వైపు సముద్రం ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. భూ భాగం తక్కువగా ఉంది. ఇక్కడ ఉత్పాదకత ఎక్కువ ఉండే ప్రాజెక్టులు రావాలి. అయితే అణు విద్యుత్ కేంద్రాలు లాంటివి తీసుకొచ్చి పెడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మిగులు భూములు లేవు. అయినా ఇక్కడే భూ సేకరణ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో మిగులు భూములు ఉన్నాయి.

90 శాతం వెనుకబడ్డ ప్రజలు ఉన్న ప్రాంతమిది. ఇక్కడ బతకలేని పరిస్థితులు తీసుకు వచ్చారు కనుకనే ఇతర ప్రాంతాలకి వలసపోతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా గోనె సంచి చుట్టిన శవం కనిపించిందంటే అది ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన వాళ్లదే అవుతుంది. ‘అభివృద్ధి చేస్తున్నాము’ అంటున్నారు... అదేమీ మాకు అందటం లేదు. 2.65 లక్షల ఎకరాల కొల్లేరును దోచేశారు... ఆ నీళ్లు లేవు కనుక పట్టిసీమ పేరుతో గోదావరి నీళ్లు మళ్లిస్తున్నారు. అవి ఉత్తరాంధ్రకు రావాల్సినవి. మా భూములు... మా నీళ్లు మాకు కావాలి. మా ప్రాంత వెనుకబాటుతనం గురించి గళం వినిపిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  వెంట ఉంటాం’ అని అన్నారు.

More Telugu News