Laloo: లాలూ ప్రసాద్ యాదవ్ కు ఫోన్ కాల్ చేసిన నితీశ్ కుమార్!

  • ముంబై ఆసుపత్రిలో లాలూకు శస్త్రచికిత్స
  • ఫోన్ చేసి పరామర్శించిన నితీశ్ కుమార్
  • నాలుగు నెలల తరువాత గుర్తొచ్చారా? అని తేజస్వీ విసుర్లు

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ మీడియాకు వెల్లడించారు. తన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పరామర్శించేందుకు నితీశ్ ఫోన్ చేశారని, అంతకుమించి ఇంకేమీ లేదని అన్నారు.

కాగా, బీజేపీకి నితీశ్ దూరమవుతున్నారన్న సంకేతాలు వెలువడుతున్న వేళ, ఈ ఫోన్ సంభాషణ కొత్త రాజకీయ మలుపులకు సంకేతం కావచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావాలని నితీశ్ భావిస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, తన తండ్రికి ఆదివారం నాడు ఫిస్టులా ఆపరేషన్ జరిగిందని, ఆ విషయం తెలుసుకున్న నితీశ్, పరామర్శించేందుకు ఫోన్ చేసి మాట్లాడారని తేజస్వీ యాదవ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇదే సమయంలో ఆయనపై కొన్ని విసుర్లూ వదిలారు. తన తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే, ఆ విషయం నితీశ్ కు తెలియడానికి నాలుగు నెలలు పట్టిందని వ్యంగ్యంగా అన్నారు. ప్రస్తుతం లాలూ ముంబై లోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందుతున్నారు.

More Telugu News