Chandrababu: ఉక్కు ఫ్యాక్టరీ ఎలా సాధించాలో చంద్రబాబుకు తెలుసు: డొక్కా మాణిక్య వరప్రసాద్

  • ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు కడప ఉక్కు ఫ్యాక్టరీ
  • వైసీపీ నేతలు మద్దతు తెలుపకుండా రాజకీయం చేస్తున్నారు
  • దేశ రాజకీయాలను ప్రభావితం చేసేది చంద్రబాబునాయుడే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తామని శాసన మండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని ఎలా సాధించాలో చంద్రబాబు నాయుడుకు తెలుసని, ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు కడప ఉక్కు ఫ్యాక్టరీ అని అన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసన మండలి సభ్యుడు బీటెక్ రవి ఇద్దరూ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తుంటే వైసీపీ నేతలు వారికి మద్దతు తెలుపకుండా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

తనకు అనుమతిస్తే రెండేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తానని గాలి జనార్దన్ రెడ్డి చెబుతున్నారని, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం లేదని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపిందని.. ఇదంతా చూస్తుంటే బీజేపీ, వైసీపీ, గాలి జనార్దన్ రెడ్డి ఆడుతున్న నాటకమని అన్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనిని ఏర్పాటు చేయకపోతే బీజేపీని ఎండగడతామని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని వైసీపీ నేత జగన్మోహన రెడ్డి గానీ, జనసేన నేత పవన్ కల్యాణ్ గానీ కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయరని ప్రశ్నించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేది చంద్రబాబు నాయుడేనని, ప్రధానిని నిర్ణయించేది తెలుగు ప్రజలేనని డొక్కా అభిప్రాయపడ్డారు.

More Telugu News