mahender reddy: మంత్రి మహేందర్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి!

  • ఈ ఉదయం లింగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • ఐదుగురి దుర్మరణం
  • రహదారిపై ధర్నా చేపట్టిన బాధితుల బంధువులు
  • పరామర్శకు వచ్చిన మంత్రి కాన్వాయ్ పై దాడి

తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ ఉదయం రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం లింగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు కూరగాయలను ఆటోలో వేసుకుని, హైదరాబాద్ బయలుదేరారు. లింగంపల్లి వద్దకు రాగానే... ఎదురుగా వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో యువకులు కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుల బంధువులు మృతదేహాలతో మంచాల రహదారిపై ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మహేందర్ రెడ్డి అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్ పై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేశారు. రాళ్లు రువ్విన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News