Nellore District: నిత్యమూ నెల్లూరు టూ చెన్నై ప్రయాణంలో ప్రేమాయణం... యువతిని మోసం చేసిన కొలీగ్!

  • ఒకే కంపెనీలో పని చేస్తుండటంతో పరిచయం
  • పెళ్లి పేరిట లోబరచుకున్న యువకుడు
  • ఆపై మోసం చేయడంతో కేసు నమోదు

వారిద్దరిదీ నెల్లూరు. ఇద్దరూ చెన్నైలోని ఒకే కంపెనీలో పనిచేస్తుంటారు. దీంతో సహజంగానే వారి మధ్య పరిచయం స్నేహంతో మొదలైంది. నిత్యమూ కలసి నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లి, తిరిగి వచ్చే క్రమంలో అమ్మాయిని మోసం చేసిన యువకుడు, పెళ్లి పేరిట లోబరచుకుని ఆపై మొహం చాటేయగా, చీటింగ్ కేసు నమోదైంది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నెల్లూరులో నల్లమోలు దివ్యతేజ అనే యువకుడు, మరో యువతి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఇద్దరూ చెన్నైకి వెళ్లి వచ్చేవారు. తొలుత స్నేహం, ఆపై ప్రేమ వీరిమధ్య చిగురించగా, పెళ్లి చేసుకుంటానని చెప్పిన తేజ, యువతిని శారీరకంగా లోబరచుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ఆమె అడగటంతో దూరం పెట్టడం ప్రారంభించాడు.

 యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారు తేజ తల్లిదండ్రులను కలసి ఇద్దరికీ పెళ్లి చేద్దామని కోరారు. వారెవరూ పెళ్లికి అంగీకరించేది లేదని తెగేసి చెప్పడంతో పాటు, చంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, దివ్యతేజతో పాటు ఆయన తల్లి, సోదరులపై కేసు పెట్టి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News