West Godavari District: అప్పిచ్చిన వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితక్కొట్టిన భర్త!

  • పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఘటన
  • రోడ్డుపై కాపుకాసి భార్య వివాహేతర బంధాన్ని బట్టబయలు చేసిన భర్త
  • భర్తపై ఆరోపణలు చేసిన భార్య - రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కాపురాలలో చిచ్చుపెడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సమీపంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భార్యను, ఆమెతో కలిసున్న ఓ వ్యాపారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దాడికి దిగాడో భర్త.

మరిన్ని వివరాల్లోకి వెళితే, వెంకటేశ్వరరావు, శ్రీదేవి భార్యాభర్తలు. అదే ప్రాంతంలో కలప వ్యాపారం చేసుకునే రామకృష్ణరాజు వద్ద వెంకటేశ్వరరావు రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ రుణం తిరిగి చెల్లించాలని వెంకటేశ్వరరావు ఇంటి వద్దకు వచ్చి అడిగి వెళుతున్న సమయంలో శ్రీదేవితో రామకృష్ణరాజుకు పరిచయం పెరిగింది. వారిద్దరి మధ్యా వివాహేతర బంధం కొనసాగుతోందని గమనించిన వెంకటేశ్వరరావు, పలుమార్లు భార్యను మందలించినా, ఆమె తన పద్ధతి మార్చుకోలేదు.

ఈ క్రమంలో తన భార్య రామకృష్ణతో కలసి వెళ్లిందని తెలుసుకున్న వెంకటేశ్వరరావు, స్నేహితులతో కలసి చింతలపూడి రోడ్డుపై కాపుకాసి, వారు కారులో వస్తుండగా అడ్డగించాడు. ఎక్కడి నుంచి వస్తున్నారంటూ నిలదీసి కారును ధ్వంసం చేసి, వారిపై దాడి చేశాడు. ఆపై వారిద్దరి మీదా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, తన భర్త ఎంతో మంది వద్ద రుణాలు తీసుకున్నాడని, వారందరితోనూ తనకు అక్రమ సంబంధం అంటగడుతున్నాడని శ్రీదేవి మీడియాకు తెలిపింది. తనకు లిఫ్ట్ ఇచ్చిన పాపానికి రామకృష్ణను కొట్టాడని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయగా, రెండు కేసులనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News