mahender reddy: అక్రమార్కుల మీద కఠిన చర్యలు.. రూ.100 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం: మంత్రి మహేందర్ రెడ్డి

  • తోహాస్ అక్రమాలకు అడ్డుకట్ట
  • మంత్రి చొరవతో తిరిగి ప్రభుత్వ పరమైన ఆస్తులు
  • లెక్కలు లేకుండా పోయిన నిధులపై ఆరా

ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ (తోహాస్) అక్రమాలకు అడ్డుకట్ట పడింది. నకిలీ దస్తావేజులు సృష్టించి అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల పరమైన సుమారు రూ.100 కోట్ల తోహాస్ భూములు మంత్రి మహేందర్ రెడ్డి చొరవతో ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. జాతీయ రహదారుల మీద ట్రక్ డ్రైవర్ లకు విశ్రాంతినిచ్చేందుకు కేంద్ర సర్కారు సహకారంతో 1987 లో రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిసర పెద్దంబర్ పేట (కలాన్) వద్ద రవాణాశాఖ కమిషనర్ అధ్యక్షతన ట్రక్ పార్కింగ్ స్థలం కేటాయించి భవన నిర్మాణం కోసం రూ.25 లక్షలు సైతం అందించారు.

అప్పట్లో ఎన్‌హెచ్‌ 9 మీద సర్వే నెంబర్ 244 లో రవాణా శాఖ కమిషనర్ చైర్మన్ గా, ట్రక్ ఆపరేటర్స్ ప్రతినిధులు, కేంద్ర ప్రతినిధులతో ఏర్పాటైన కమిటీకి 9.37 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే చైర్మన్, కమిటీ అనుమతి లేకుండా కార్యదర్శి తన కుమారుడి పేర అక్రమంగా భోగస్ కంపెనీ సృష్టించి సదరు కంపెనీ పేరు మీద 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. సదరు భోగస్ కంపెనీ ఈ స్థలంలో ప్రైవేటు నిర్మాణాలు చేపట్టటంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

దీంతో రవాణా శాఖ మంత్రి పీ మహేందర్ రెడ్డి స్పందించి చర్యలకు ఆదేశించారు. రెండు దఫాలుగా ఉన్నతాధికారులు, లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు. భోగస్ కంపెనీ స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి ప్రభుత్వ పరం చేసేందుకు అధికారులను నిర్దేశించి క్రిమినల్ కేసులకు ఆదేశించారు. భూములను కాపాడేందుకు ఒత్తిడి తెచ్చారు.

ఇదే సందర్భంగా గతంలో తోహాస్ కమిటీకి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పరిహారంగా విడుదల చేసి లెక్కలు లేకుండా పోయిన రూ. 40,17,487 నిధుల బాధ్యుల మీద చర్యలకు మంత్రి ఆదేశించారు. అనంతరం రవాణా శాఖ ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో నిరంతరం సమీక్షిస్తూ ఎట్టకేలకు భూములను తిరిగి స్వాధీనం చేసుకునేలా చేశారు. ఇలా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ అధికారులు సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి మంత్రికి వివరించారు.

అయితే, రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోని తోహాస్, రవాణా శాఖ ఇతర భూములపై మంత్రి మరోసారి ప్రిన్స్ పల్ సెక్రటరీ సునీల్ శర్మతో చర్చించారు. పేట్ బషీరాబాద్, తిమ్మాపూర్ (కరీంనగర్), హన్మకొండ (వరంగల్), కామారెడ్డి, బాలానగర్ (మహబూబ్ నగర్)లో తోహాస్ కు కేటాయించిన స్థలాలను, ఇతర స్థలాలు దుర్వినియోగం, అన్యాక్రాంతం కాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ భూములకు టోకరా వేసేందుకు యత్నించిన వారి మీద చర్యల గురించి మంత్రి వాకాబు చేశారు.           

More Telugu News