Chandrababu: మోదీని చంద్రబాబు ఏ మేరకు నిలదీశారో చెప్పాలి: వైసీపీ నేత పార్థసారథి

  • ఏపీలో పెడబొబ్బలు పెట్టి.. ఢిల్లీలో మీడియాకు మొహం చాటేశారు
  • మోదీ అంటే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు?
  • బలహీనవర్గాల ప్రజలు చంద్రబాబు భరతం పడతారు

ఏపీ ప్రయోజనాల విషయమై ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఏ మేరకు నిలదీశారో చెప్పాలని వైసీపీ నేత పార్థసారథి ప్రశ్నించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీతి ఆయోగ్ సమావేశం నిమిత్తం ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రతి తెలుగువాడు తలదించుకునేలా వంగివంగి మోదీకి దండాలు పెట్టారని విమర్శించారు.

ఏపీలో పెడబొబ్బలు పెట్టి ఢిల్లీలో మీడియాకు చంద్రబాబు మొహం చాటేశారని విమర్శించారు. అసలు, మోదీ అంటే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని, టీడీపీ కనుక అవినీతి రహిత పాలన చేస్తే భయపడాల్సిన అవసరమేముందని అన్నారు. బలహీనవర్గాల ప్రజలపై చంద్రబాబు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

‘బలహీనవర్గాలు సెకండ్ గ్రేడ్ పౌరులా? హక్కుల కోసం పోరాడితే తోలుతీస్తాం, తోక కట్ చేస్తాం అంటారా? మత్స్యకారులపై తోలు తీస్తామంటూ చంద్రబాబు ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. నిన్న నాయీబ్రాహ్మణులపై బెదిరింపులకు పాల్పడ్డారు. బలహీనవర్గాల ప్రజలు చంద్రబాబు భరతం పడతారు. కులవివక్షతో ఇతరులను అవమానిస్తున్న చంద్రబాబు సీఎంగా అర్హుడా? చంద్రబాబు అవినీతిపై పుస్తకం వేసి దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తాం. చంద్రబాబు ఎంత అవినీతిపరుడో దేశప్రజల దృష్టికి తీసుకెళ్తాం’ అన్నారు పార్థసారథి.

More Telugu News