nawaz sharrif: నవాజ్ షరీఫ్ భార్య ఆరోగ్య పరిస్థితి విషమం.. 'హైలీ క్రిటికల్' అన్న లండన్ డాక్టర్లు

  • మృత్యువుతో పోరాడుతున్న కుల్సూమ్ నవాజ్
  • ఇంకా మెరుగుపడని ఆరోగ్యం
  • లండన్ లోనే ఉండిపోయిన నవాజ్ షరీఫ్

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ నవాజ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆమె కండిషన్ 'హైలీ క్రిటికల్' అంటూ లండన్ లోని హార్లీ స్ట్రీట్ క్లినిక్ వైద్యులు స్పష్టం చేశారు. ఐదుగురితో కూడిన వైద్య బృందం ఈరోజు కుల్సూమ్ ఆరోగ్య పరిస్థితిని వివరించింది. ఆమె వెంటిలేటర్లపైనే ఉన్నారని వారు తెలిపారు. ఈ మేరకు జియో టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.

కాగా, గతేడాది ఆగస్టులో కుల్సూమ్ నవాజ్ గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచీ ఆమెకు పలు సర్జరీలు నిర్వహించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె పరిస్థితి విషమించడంతో లండన్ తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 14న ఆమె అకస్మాత్తుగా గుండెపోటుకు గురవడంతో ఐసీయూకి తరలించి, వెంటిలేటర్స్ పై ఉంచి చికిత్స చేస్తున్నారు.

ఈ వార్త తెలియగానే నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యం నవాజ్ హుటాహుటీన లండన్ చేరుకున్నారు. డాక్టర్ల సూచనపై అప్పటి నుంచీ వారు అక్కడే వుండిపోయారు. అయితే, నవాజ్, కూతురు మర్యం స్వదేశంలోని కోర్టు కేసుల రీత్యా వెళ్లవలసి వుంది. దీంతో కోర్టుకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ వారు దరఖాస్తు చేసుకున్నారు.  

More Telugu News